‘మీరు పార్టీలోకి రాకముందే గులాబీ జెండా మోసినం. ఇగ తెలంగాణ వస్తది అని తెలిసి మీరు పార్టీల చేరిన్రు. కేసీఆర్ పుణ్యమా అని పదవులు అనుభవించున్రు. ఇప్పుడు అధికారంలో లేదని వెళ్లిపోయిన్రు. అధికారం కోసం మేము గులాబీ జెండా ఎత్తుకోలేదు. తెలంగాణ కోసం కేసీఆర్తోనే ఉంటం. దయచేసి ఇంకోసారి ఇటువంటి ప్రయత్నాలు చేయకండి’
– ఇతర పార్టీ అభ్యర్థితో ఒక గులాబీ సైనికుడు
BRS | హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీలు వేస్తున్న ఎత్తులను బీఆర్ఎస్ క్యాడర్ చిత్తుచేస్తున్నది. గత నెల 24వ తేదీ నుంచి కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రతో గులాబీ శ్రేణుల్లో సమరోత్సాహం తొణికిసలాడుతున్నది. ఆ జోష్ రోజురోజుకూ పెరుగుతున్నది. ఇదే ఉత్సాహం గులాబీ శ్రేణుల్లో కొనసాగితే తమ ఆశలు గల్లంతేనని గ్రహించిన కాంగ్రెస్, బీజేపీల అగ్రనాయకులు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను మచ్చిక చేసుకోవాలని తమ తమ అభ్యర్థులకు, స్థానిక నాయకులకు ఆదేశాలు జారీ చేశారు.
బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా పటిష్టంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను తమవైపు తిప్పుకోవాలని వ్యూహాలు రచించారు. కొన్ని ప్రాంతాల్లో పాచికలు వేశారు. బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీల్లో చేరి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య (వరంగల్), అరూరి రమేశ్ (వరంగల్), దానం నాగేందర్ (సికింద్రాబాద్), సైదిరెడ్డి (నల్లగొండ), బీబీ పాటిల్ (జహీరాబాద్), రంజిత్రెడ్డి (చేవెళ్ల), సీతారాంనాయక్ (మహబూబాబాద్), జీ నగేశ్ (ఆదిలాబాద్), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి), కొండా విశ్వేశ్వర్రెడ్డి (చేవెళ్ల) తదితరులు తమకు ఉన్న పాత పరిచయాలతో ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను మచ్చిగ చేసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, వారి ప్రలోభాలకు, మాయలకు బీఆర్ఎస్ క్యాడర్ లొంగడంలేదు. దీంతో అన్ని జిల్లాల్లో విస్తృత నెట్వర్క్ కలిగి ఉన్న బీఆర్ఎస్ పార్టీ పునాదిని కదలించలేమని కాంగ్రెస్, బీజేపీ నేతలకు అర్థమవుతున్నది.
కేసీఆర్ బస్సు యాత్రతో క్యాడర్లో జోష్
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తొలినాళ్లలో బీఆర్ఎస్ శ్రేణులు సహజంగానే ఒకింత నైరాశ్యానికి గురయ్యాయి. దానికితోడు సిట్టింగ్ ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్, బీజేపీల పంచన చేరడం వారిని మరికొంత నిరుత్సాహ పరిచింది. ఈ నేపథ్యంలో గత నెల 24 నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర ఒక్కసారిగా వాతావరణాన్ని మార్చేసింది.
కేసీఆర్కు ప్రతిచోటా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. కేసీఆర్ పాలనలేని లోటు కనిపిస్తుందని చర్చించుకుంటున్నారు. తమ ప్రియతమ నేతను మళ్లీ ఉన్నతస్థానంలో చూడాలన్న ఆకాంక్షను వ్యక్తంచేస్తున్నారు. కేసీఆర్ పట్ల ప్రజల్లో చెక్కు చెదరని అభిమానాన్ని గమనించిన బీఆర్ఎస్ క్యాడర్లో సరికొత్త ఉత్సాహం ఉరకలేస్తున్నది. మరోవైపు, అధికారంలోకి వచ్చీరాగానే బీఆర్ఎస్ కార్యకర్తల మనోబలంపై దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
దీనిని ధీటుగా ఎదుర్కొనేందుకు కేసీఆర్ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చే కార్యక్రమాలు చేపట్టారు. ఎక్కడికక్కడ లీగల్ టీములను ఏర్పాటుచేశారు. భౌతికదాడులకు బెదిరిపోవద్దని ధైర్యం నూరిపోశారు. ప్రజా తిరుగుబాటుకు కారకులు కావద్దంటూ ఒక దశలో మెదక్ సభలో ఏకంగా డీజీపీని ఉద్దేశించి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి పరిణామాలు బీఆర్ఎస్ క్యాడర్లో ఆత్మవిశ్వాసం నింపాయి. ఫలితంగా పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించి తీరాలనే కసి పెరిగింది. ఈ అనూహ్య పరిణామాలు కాంగ్రెస్, బీజేపీలకు శరాఘాతంగా మారుతున్నాయి.
మైండ్గేమ్ను తిప్పికొడుతున్న గులాబీలు
కాంగ్రెస్, బీజేపీల మైండ్గేమ్ను బీఆర్ఎస్ క్యాడర్ బలంగా తిప్పికొడుతున్నది. వరంగల్, చేవెళ్ల, జహీరాబాద్, మహబూబాబాద్ లోక్సభ నియోకవర్గాల్లో ఇరు పార్టీల అభ్యర్థులు, వారి ప్రధాన అనుచరులు బీఆర్ఎస్ క్యాడర్లోని ముఖ్యనాయకులను కలిసి తమకు సహకరించాలని కోరుతున్నారు. అయితే, వీరికి బీఆర్ఎస్ క్యాడర్ నుంచి తిరస్కారం ఎదురవుతున్నది. ‘మీరు పార్టీలోకి రాకముందే మేం గులాబీ జెండా మోసినం.
తెలంగాణ రాష్ట్రం వచ్చేముందు మీరు పార్టీలోకి వచ్చారు. బీఆర్ఎస్ పుణ్యమా అని పదవులు అనుభవించారు. పార్టీ ఇప్పుడు అధికారంలో లేదని వెళ్లిపోయారు. మేం అధికారం కోసం పార్టీలోకి రాలేదు. తెలంగాణ కోసం అప్పుడే కాదు ఎప్పుడూ మేం కేసీఆర్తోనే ఉంటం. అధికారం ఉన్నా లేకున్నా… దయచేసి ఇంకోసారి ఇటువంటి ప్రయత్నాలు చేయకండి’ అని వరంగల్లో ఒక గులాబీ సైనికుడు తెగేసి చెప్పడంతో సదరు అభ్యర్థి బిక్కమొహం వేశారని సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలను చేరదీసి, వారికే టికెట్లు ఇస్తే, ఎక్కడికక్కడ బీఆర్ఎస్ క్యాడర్ కూడా వస్తుందని ఆశించిన బీజేపీ, కాంగ్రెస్ పెద్దలకు చివరకు నిరాశే మిగులుతున్నది.