నల్లగొండ : పట్టణంలోని శ్రీనగర్కాలనీలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. తిప్పర్తి మండలం పెద్దసురారంకు చెందిన వెంకన్న, శ్రీకాంత్ అన్నదమ్ములు. వీరిద్దరు నల్లగొండలోనే శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారని సమాచారం.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుకున్న మేరకు లాభాలు రాకపోవడంతో పాటు తీవ్ర నష్టాలు వచ్చినట్లు తెలియవచ్చింది. తెచ్చిన అప్పులు కూడా భారంగా మారడంతో విధిలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. వెంకన్న, శ్రీకాంత్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర దవఖానాకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ముల మృతితో కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.