హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 21: కాకతీయ విశ్వవిద్యాలయాన్ని ప్రతిష్ఠాత్మక బ్రిటిష్ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రమేశ్ అధ్యక్షతన వివిధ విభాగాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అకడమిక్ అంశాల్లో భాగంగా డిగ్రీ ప్రోగ్రాములపై కేయూ పక్షాన ప్రొఫెసర్లు కే రాజిరెడ్డి, కే విజయబాబు, బీ సురేష్లాల్ చర్చించారు. డిగ్రీ స్థాయి పాఠ్య ప్రణాళికల్లో వస్తున్న ధోరణులను, మార్పులను ఆయా విభాగాల వారీగా చర్చించారు.
విశ్వవిద్యాలయ పరిశోధనల సామర్థ్యాలు, విజయాలపై ప్రొఫెసర్లు ఏ సదానందం, శ్రీనివాసులు, గార్లపాటి అచ్చయ్య వివరించారు. అధ్యాపకులు అడిగిన సందేహాలను అబిర్స్విత్, బంగౌర్ యూనివర్సిటీల వీసీలు ప్రొఫెసర్ టీం వుడ్స్, నికోలా క్యాలావ్, అధికారులు బెవ్ హెర్రింగ్, డాక్టర్ ఏమో ఈయోలు నివృత్తి చేశారు. అవగాహనా ఒప్పందాలపైనా సానుకూల చర్చ జరిగినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టీ శ్రీనివాసరావు, వివిధ విభాగాల ప్రతినిధులు, అధ్యాపకులు పాల్గొన్నారు.