హైదరాబాద్, మే 18(నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్ఐపాస్పై బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్యమంత్రి రణిల్ జయవర్ధన ప్రశంసల జల్లు కురిపించారు. ఆ పథకం బాగుందని కితాబిచ్చారు. యూకేలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు బుధవారం జయవర్ధనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మంత్రి జయవర్ధన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పారిశ్రామికరంగంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు, రాష్ట్రంలోని మౌలిక వసతులు, పెట్టుబడికి అవకాశాలపై మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బయోఏషియా సదస్సులో పాల్గొనాల్సిందిగా జయవర్ధనను ఆయన ఆహ్వానించారు.
పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా యూకేలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ తొలిరోజు బిజీ బిజీగా గడిపారు. తెలంగాణలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాలను ఇకడి సంస్థలకు ఆయన పరిచయం చేస్తున్నారు. బుధవారం యునైటెడ్ కింగ్డం-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూకేఐబీసీ) ఏర్పాటు చేసిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ కేటీఆర్ పాల్గొన్నారు. టీఎస్ ఐపాస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా-లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకువచ్చిన పాలసీలు, వాటితో తెలంగాణకు ఒనగూరిన భారీ పెట్టుబడుల వివరాలను పలు కంపెనీల ప్రతినిధులకు వివరించారు. తెలంగాణలో వినూత్న పారిశ్రామిక పాలసీలతోపాటు పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు, భూమి, నీళ్లు విద్యుత్ సదుపాయాలు, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. భారతదేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా అత్యుత్తమమైన మౌలిక వసతులు, పాలసీలు, ప్రోత్సాహకాలు తెలంగాణలో ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. ముఖ్యంగా దేశంలోని ఇతర నగరాల్లోలేని అసలు సిసలైన కాస్మోపాలిటన్ కల్చర్ హైదరాబాద్లో మాత్రమే ఉందన్నారు.
ఇండియాలో జీవించేందుకు అత్యంత అనువైన నగరంగా అనేకసార్లు అవార్డులను హైదరాబాద్ అందుకున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ సమావేశాల్లో ప్రస్తావించారు. ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్ రంగాలకు హైదరాబాద్ హబ్గా మారిందని పేర్కొన్న మంత్రి కేటీఆర్.. పలు బహుళజాతి కంపెనీలు అమెరికా ఆవల తమ అతి పెద్ద కార్యాలయాలను నగరంలోనే ఏర్పాటు చేశాయని కేటీఆర్ గుర్తుచేశారు. ఇండియా, ఇంగ్లాండ్ మధ్య అనేక దశాబ్దాలుగా ఉన్న బలమైన వ్యాపార వాణిజ్య సంబంధాల నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలు తెలంగాణకు తమ మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ లోని వినూత్న, విప్లవాత్మక విధానాలు, అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. డెలాయిట్, హెచ్ఎస్బీసీ, జేసీబీ, రోల్స్రాయిస్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొన్న ఈ సమావేశాల్లో హైదరాబాద్లో బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ అండ్రూ ఫ్లెమింగ్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్తోపాటు తెలంగాణ అధికార ప్రతినిధి బృందం పాల్గొన్నది.
లండన్లో మంత్రి కేటీఆర్కు ఘన స్వాగతం
యునైటెడ్ కింగ్డమ్ (యూకే), దావోస్ పర్యటన నిమిత్తం బుధవారం తెల్లవారుజామున లండన్ చేరుకున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారక రామారావుకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. తెలంగాణ, ఏపీకి చెందిన బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ సహా యూకేకు చెందిన టీఆర్ఎస్ విభాగం, పలు ఎన్నారై సంఘాల నేతలు, ప్రముఖులు వందల సంఖ్యలో కేటీఆర్కు స్వాగతం పలికేందుకు లండన్ విమానాశ్రయానికి చేరుకొన్నారు. అనేక మంది తమ కుటుంబసభ్యులతో అక్కడికి చేరుకొని కేటీఆర్కు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఉత్సాహంగా కేటీఆర్తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకున్నారు. విమానాశ్రయం నుంచి వెళ్లే మార్గంలో సైతం ఎన్నారై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేటీఆర్కు స్వాగత హోర్డింగులు ఏర్పాటు చేశారు. బుధవారం నుంచి అనేక రంగాలకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం కానున్నారు.
అభిమానానికి కృతజ్ఞతలు: కేటీఆర్
తనపై ప్రేమతో విమానాశ్రయానికి వచ్చి ఘన స్వాగతం పలికిన తెలంగాణ ఎన్నారైలకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా దశాబ్దకాలానికిపైగా యూకేలో ఎన్నారై టీఆర్ఎస్శాఖ విస్తరణకు కృషిచేస్తున్న అనిల్ కూర్మాచలానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆ శాఖ అధ్యక్షుడు అశోక్ దూసరి ప్రత్యేక నంబర్ ప్లేటు గల కారులో తీసుకొని వెళ్లినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. విమానాశ్రయానికి విచ్చేసిన అభిమానులతో కూడిన పలు ఫొటోలను మంత్రి ట్విట్టర్లో పోస్ట్చేశారు.