హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): దేశంలో గుణాత్మక మార్పు రావాలంటే కేంద్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశమంతా విస్తరించాలనే ఆకాంక్ష ప్రతి ఒక్కరిలోనూ ఉన్నదని చెప్పారు. బుధవారం ఆయ న బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియా తో మాట్లాడుతూ.. దేశంలో ఉన్న సంపద ప్రజలందరికీ అందాలనే దృఢ సంకల్పంతో బీఆర్ఎస్ ముందుకు సాగుతున్నదని తెలిపారు. దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ నడుంకట్టారని కొనియాడారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసేందుకు కేంద్రానికి, బీజేపీ నాయకత్వానికి కండ్లు లేవని, అందుకే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి అంశంలోనూ వంకరగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణకు ఉపయోగపడే పనులేవీ చేయలేదని దుయ్యబట్టారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం బండికి ప్యాషన్గా మారిందని ఎద్దేవాచేశారు. కేంద్రం తెలంగాణకు చేస్తున్న అన్యాయంపై ఏనాడు స్పందించని బండికి రాష్ట్ర ప్రభుత్వం పై, సీఎం కేసీఆర్పై మాట్లాడే నైతికహక్కు లేదని స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్రెడ్డి తీరుపై స్పందించాల్సిన అసవరం లేదని పేర్కొన్నారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్లో ప్రశ్నించిన ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ అనే విషయాన్ని బండి సంజయ్, రేవంత్రెడ్డి గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రాష్ర్టానికి ఏమాత్రం అన్యాయం జరుగకుండా, దేశాన్ని గాడిలో పెట్టగల నాయకుడు సీఎం కేసీఆర్ ఒక్కరేనని చెప్పారు.
కంటివెలుగును స్వాగతించాలి
కంటివెలుగు రెండో విడత కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వాగతించాలని బడుగుల లింగయ్య కోరారు. పేదలకు ఉపయోగపడే కంటివెలుగును రాజకీయ కోణంలో చూడొద్దని హితవు చెప్పారు. సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా అందులో ప్రజా ప్రయోజనం ఉంటుందని తెలిపారు. దేశంలో ఏ ప్రభుత్వం, ఏ పాలకుడూ చేయని ఆలోచన సీఎం కేసీఆర్ చేశారని, అందుకు కంటివెలుగు నిదర్శనమని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పేర్కొన్నా రు. రాజకీయాలు చేయడమే పరమావధిగా కాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను స్వాగతించాలని సూచించారు.