Breast Cancer | న్యూఢిల్లీ, మార్చి 24: మిగతా రాష్ర్టాలతో పోలిస్తే తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీలలో రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తాజా అధ్యయనంలో వెల్లడైంది. 2025 నాటికి ఈ సంఖ్య మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. 2012-2016 మధ్య ఈ అధ్యయనం జరిగింది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో రొమ్ము క్యాన్సర్ బాధితుల సంఖ్య తక్కువగా ఉన్నది.
పట్టణ ప్రాంతాల్లో కూర్చొని చేసే పనులు పెరగడం, స్థూలకాయం, ఆలస్యంగా వివాహాలు, శిశు జననాలు, తక్కువగా పిల్లలకు పాలివ్వడం తదితర కారణాల వల్ల రొమ్ము క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్టు గుర్తించారు. తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన మహిళలకు ఆరోగ్య అవగాహన తక్కువగా ఉండటం వల్ల రొమ్ము క్యాన్సర్కు సమగ్ర చికిత్సను పొందలేకపోతున్నారు. జాతీయ క్యాన్సర్ నమోదు కార్యక్రమం సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు.