యాదాద్రి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బ్రేక్ దర్శనం భక్తులకు త్వరలో చేరువకానున్నది. తిరుమల తిరుపతి తరహాలో వీవీఐపీ, వీఐపీలకు ప్రత్యేకమైన దర్శనాన్ని కల్పించేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం కావాల్సిన ఏర్పాట్లపై రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ శనివారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.
ప్రధానాలయ ఉత్తర పంచతల రాజగోపురం గుండా ఈశాన్య ప్రాంతంలో నిర్మించిన వెలుపలి ప్రాకార మండపంలో బ్రేక్ దర్శనానికి కావాల్సిన క్యూ లైన్లను ఏర్పాటు చేసి, త్రితల రాజగోపురం గుండా ఆలయంలోకి ప్రవేశించే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రతిరోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనం ఇవ్వనున్నట్టు ఆలయ ఈవో ఎన్ గీత వెల్లడించారు.
బ్రేక్ దర్శన సమయంలో ధర్మ దర్శనం, రూ.150 దర్శనం నిలిపివేయనున్నట్టు పేర్కొన్నారు. బ్రేక్ దర్శనానికి ఒక్కొక్కరికి రూ. 300 రుసుం ఉంటుందన్నారు. బ్రేక్ దర్శనంలో వచ్చే భక్తులకు స్వయంభూ మూర్తుల దర్శనంతోపాటు గర్భాలయంలో హారతిని ఇవ్వనున్నట్టు తెలిపారు. త్వరలో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానున్నట్టు వెల్లడించారు.