హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చ్ 16 (నమస్తే తెలంగాణ): బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఆశీర్వచన మంత్రాలను అవహేళన చేసిన అధికారపార్టీకి చెందిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్పై చర్య తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి. మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలపై వివిధ బ్రాహ్మణ సంఘాలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఆశీర్వచన మంత్రాలకు విపరీత వ్యాఖ్యానం చేస్తూ సామేల్ అసభ్యంగా మాట్లాడారంటూ మండిపడ్డాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హనుమకొండలో తె లంగాణ బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు సామేల్పై, అతని వ్యాఖ్యలను సమర్థించిన మానకొండూ రు ఎమ్మెల్యే సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఇద్దరి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోతుకూరి రామేశ్వర్రావు డిమాండ్ చేశారు. అర్చకులు, బ్రాహ్మణులు, హిందువులను ఉద్దేశించి సామేల్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర అర్చక సమాఖ్య తరపున జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, అధ్యక్షుడు గట్టుశ్రీనివాసాచార్యులు ఖండించారు. ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకుని అతని శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేయడానికి సిద్ధమవుతామని, అన్ని సంఘాలు ఏకమై కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ధూప దీపనైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ ఆ ధ్వర్యంలో సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కార్యాలయం ముందు నిరసన వ్యక్తంచేసి ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చారు.