CM KCR | హైదరాబాద్ గోపన్పల్లిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బ్రాహ్మణ పరిషత్ భవనం నిర్మించిన విషయం తెలిసిందే. ఈ భవనాన్ని ఈ నెల 31న ప్రారంభించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. భవనం ప్రారంభోత్సవం సందర్భంగా పుణ్యక్షేత్రాల నుంచి అర్చకులను.. అలాగే పీఠాధిపతులు, మతపెద్దలను ఆహ్వానించాలన్నారు. బ్రాహ్మణ పరిషత్ భావితరాలకు ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతుందన్నారు. దేశంలోని బ్రాహ్మణ ప్రజాప్రతినిధులను కార్యక్రమానికి పిలవాలని సూచించారు.
బ్రాహ్మణ వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పౌరోహిత్యం నమ్ముకున్న బ్రాహ్మణ పిల్లలకు చదువులు అందిస్తున్నట్లు తెలిపారు. మల్లినాథసూరి సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, విశ్వవిద్యాలయం కోసం చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. తెలంగాణ ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని పునరుజ్జీవింపజేసుకోవాలని, నాటి భాషా కవిపండితుల చరిత్రలను వెలికి తీయాలని పిలుపునిచ్చారు.