హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ అంబర్పేటలో నాలుగేండ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మృతి చెందిన ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్న హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు పురపాలక శాఖ కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ అంబర్ పేట డిప్యూటీ కమిషనర్, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఈ అంశంపై విచారణ చేపట్టనున్నది. నిజాబాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన గంగాధర్ కుటుంబం ఉపాధి కోసం హైదరాబాద్కు వలస వచ్చింది. అతని కుమారుడు ప్రదీప్ ఆడుకుంటూ వీధిలోకి రావడంతో వీధి కుక్కలు అతనిపై దాడిచేసిన విషయం తెలిసిందే.