వెల్గటూర్, మార్చి 16 : కుక్కకాటుకు గురై 15 నెలలుగా మృత్యువుతో పోరాడిన బాలుడు ఆదివారం మృతిచెందాడు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. కోటిలింగాలకు చెందిన మంచికట్ల శ్రీనివాస్- మాధవికి హయతి, మణితేజ ఇద్దరు సంతానం. శ్రీనివాస్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. 2024 డిసెంబర్లో స్వగ్రామానికి వచ్చిన మణితేజ (7)ను అదే నెల 26న మెడభాగంలో కుక్క కరిచింది. గమనించిన తల్లిదంద్రులు స్థానికంగా చికిత్స అందించి, హైదరాబాద్లోని రెయిన్బో దవాఖానకు తరలించారు. మూడు నెలలకు రూ.30 లక్షలు ఖర్చు చేసి వైద్యం అందించారు. అనంతరం హైదరాబాద్లో రెంట్కు ఉంటున్న ఇంటిలో ఒక గదిని రూ.10 లక్షలు ఖర్చు చేసి ఏసీ, వెంటిలేటర్తోపాటు అన్ని వసతులు సమకూర్చుకుని, దవాఖానలో అందించే మాదిరిగా వైద్యం అందించారు. బాలుడి వైద్యం కోసం సుమారు రూ.65 లక్షల వరకు ఖర్చు చేశారు. అయినప్పటికీ 15 నెలలపాటు మృత్యువుతో పోరాడిన బాలుడు ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో మృతిచెందాడు. ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.