హైదరాబాద్లో ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష
హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. కొవిడ్ నిబంధనలకు లోబడి ఉత్సవాలు నిర్వహించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని ఆలయాలవద్ద క్యూలైన్లు, నీటి సౌకర్యం కల్పించాలని స్పష్టంచేశారు. బోనాల ఏర్పాట్లు, నిర్వహణపై మంగళవారం అరణ్యభవన్లో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్అలీ అధికారులతో సమీక్షించారు. ఆలయ కమిటీలు, అధికారులు సంయుక్తంగా ఏర్పాట్లుచేయాలని సూచించారు. బోనాల ఉత్సవాల కింద వివిధ ఆలయాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.15 కోట్లు మంజూరు చేశారని.. ఎలాంటి లోటు లేకుండా ఘనంగా నిర్వహించాలని తెలిపారు. ఉత్సవాల నిర్వహణ, అలంకరణ, పూజ తదితర కార్యక్రమాలకు ప్రభుత్వం ఇచ్చే నిధులను సకాలంలో ఆలయ కమిటీలకు విడుదల చేయాలని కోరారు. అమ్మవారి ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దాలని, విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించాలని చెప్పారు. సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.