కరీంనగర్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రస్తుతం కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన మహిళా బిల్లు లోపభూయిష్టంగా ఉందని, నిశితంగా పరిశీలిస్తే.. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్న సంకల్పంతో, చిత్తశుద్ధితో పెట్టినట్లుగా కనిపించడం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ (Boinapally Vinodkumar) విమర్శించారు. మహిళా బిల్లు అంశంపై కరీంనగర్లో ఆయన విలేకరులతో కొద్దిసేపు మాట్లాడారు.
లోక్సభలో ప్రవేశపెట్టిన మహిళా బిల్లు క్లాస్-5 ప్రకారం చూస్తే.. జనాభా లెక్కలు జరిగిన తదుపరి మాత్రమే డీలిమిటేషన్ జరుగుతుందని, దానితదుపరి మాత్రమే మహిళా బిల్లు అమల్లోకి వస్తుందని కేంద్రం చెపుతుందన్నారు. నిజానికి 2020-21లో జరగాల్సిన జనాభా లెక్కలు కరోనా వల్ల వాయిదా పడ్డాయని అయితే.. ఈ జనాభా లెక్కల గురించి ఇప్పటివరకు కేంద్రం ఏ ప్రయత్నం చేయడం లేదన్నారు. ఆ లెక్కన చూస్తే వచ్చేజనాభా లెక్కలు 2030-31లో జరుగుతాయని, అలాగే 2030-31లో జరిగే జనాభా లెక్కల చివరి ఫైనల్ పబ్లికేషన్ ఆయ్యే నాటికి మరో మూడు నాలుగు సంవత్సరాలు పడుతుందన్నారు.
అప్పుడు ఆ లెక్కల అధారంగా డీలిమిటేషన్ ఎక్సర్ సైజ్ జరగాల్సి ఉంటుదన్నారు. వీటన్నింటిని నిశితంగా పరిశీలిస్తే.. 2039లో మహిళా బిల్లు అమలుకు నోచుకునే అవకాశం ఉన్నట్లుగా అర్థమవుతుందన్నారు. తాజాగా ప్రవేశపెట్టిన బిల్లు చిత్తశుద్ధితో ప్రవేశ పెట్టినట్లు కనిపించడం లేదన్నారు. పూర్తి అవగాహన లేమితో బిల్లును ప్రవేశపెట్టడమేకాకుండా.. మహిళకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న సంకల్పంతో పెట్టిన బిల్లులాగా కనిపించడం లేదన్నారు.
ఇది ఎప్పుడో పది పదిహేను ఏళ్లకు దృష్టిలో పెట్టుకున్నట్లుగా కనిపిస్తుందన్నారు. నిజంగా చిత్త శుద్ది ఉంటే.. ప్రస్తుతం ప్రవేశపెట్టిన మహిళా బిల్లును సవరించడానికి మరో బిల్లును ప్రవేశపెట్టి తీరాల్సిందే అన్నారు. స్పష్టత లేకుండా అవగాహన లేకుండా బిల్లు పాస్చేయడం వల్ల భవిష్యత్లోనూ అనేక అవాంతరాలు తలెత్తి.. మహిళా లోకానికి న్యాయం జరకుండా పోయే ప్రమాదం ఉందన్నారు.