కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. తెలంగాణలో 90 శాతం భూమి బడుగు, బలహీన వర్గాల చేతిలో ఉందని, వారి కోసమే రైతు బంధు, రైతు బీమా పథకాలు తీసుకొచ్చినట్లు రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్(Boinapally Vinod Kumar) తెలిపారు. నవంబర్ 4 తేదీన నగరంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజా గర్జన సభ పోస్టర్ను క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేసిన రాష్ట్రం తెలంగాణ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బలహీన వర్గాలు రాజ్యాధికారం సాధించాలనే ఉద్దేశంతోనే రిజర్వేషన్లపై తీర్మానం చేసినట్లు ఆయన చెప్పారు. ఉద్యమ సమయంలో శ్రీకృష్ణ కమిటీ కూడా తెలంగాణలో అధిక శాతం బలహీన వర్గాల వారు ఉన్నారని నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాగర్జన సభ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.