హనుమకొండ : రాష్ట్రంలో వర్షా బీభత్సంపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ( Union Minister Kisan Reddy ) అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ (Vinod Kumar) మండిపడ్డారు. ఆదివారం హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. కిషన్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం సమంజసం కాదని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం ఇచ్చే డబ్బులతోనే నడుస్తుందని గుర్తు చేశారు. జాతీయ విపత్తుల నిర్వహణ యాక్ట్ కింద నిధులు ఇచ్చి ఖర్చు చేయకుండా అనేక నిబంధనలు పెడుతుందని కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడితే జాతీయ సమైక్యతకు ముప్పు వస్తుందన్నారు. బాధితులను ఆదుకోవడానికి సలహాలు ఇవ్వాలని రాజకీయాలు చేయడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరద నష్టంపై డీపీఆర్ తయారు చేస్తుందని వెల్లడించారు.
భారీ వర్షంతో గ్రేటర్ వరంగల్(Greater Warangal ) కు తీవ్రనష్టం వాటిల్లిందన్నారు. భద్రకాళి చెరువు నాళా వడ్డెపల్లి చెరువు నాళా ను రివర్ ఫ్రంట్ గా మార్చాల్సిన అవసరం ఉందని వివరించారు. వరంగల్ మహానగరంలో రెండు రివర్ ఫ్రంట్ లను ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం కేసిఆర్కు నాళాలపై సంపూర్ణ అవగాహన ఉందని ఆయన పేర్కొన్నారు.