హైదరాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా రెండిం తలు వ్యవసాయం పెరిగింది’ అని చెప్తూనే, మరోవైపు ‘కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా రూ.లక్ష కోట్లు నీళ్ల పాలయ్యాయి’ అని రాజ్యసభలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఒక విధంగా, సప్లిమెంటరీ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం మరోలా ఉన్నదని, ఒక మంత్రి రెండు భిన్నమైన సమాధానాలు చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. కేంద్ర మంత్రి హోదాలో పార్లమెంట్ లాంటి ప్రతిష్ఠాత్మక సభలో ఇలా అబద్ధాలు చెప్పడం తగదని మండిపడ్డారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణించి ఖండిస్తున్నట్టు తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని బీఆర్ఎస్ ఎంపీలు అనేకమార్లు కేంద్రాన్ని డిమాండ్ చేసినట్టు వినోద్కుమార్ గుర్తు చేశారు. ప్రాజెక్టు గొప్పతనం గురించి తమ నాయకుడు హరీశ్రావు అనేకమార్లు వివరాలు సహా చెప్పారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనవన్నీ కొట్టుకుపోయాయా? అని నిలదీస్తూనే, అసలు ఈ ప్రాజెక్టులో లక్ష కోట్లు ఖర్చు కాలేదని చెప్పారు. పాటిల్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎంపీలు లేఖ రాశారని, రాజ్యసభ హుందాతనం కాపాడాలంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై పాటిల్ తాను చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పి తీరాలని వినోద్కుమార్ డిమాండ్ చేశారు.
ఏపీ విభజన చట్టానికి తూట్లు పొడిచి, తెలంగాణలో ఉన్న మండలాలను ఏపీలో కలిపారని బోయినపల్లి మండిపడ్డారు. ఎమ్మెల్సీల కోసం విభజన చట్టాన్ని మరోసారి మార్చారని ధ్వజమెత్తారు. ఏపీ సీఎం చంద్రబాబు ఏది చెబితే అది చేస్తుందని దుయ్యబట్టారు. తెలంగాణలో ఎంపీల సంఖ్య పెరుగడం కోసం విభజన చట్టంలో సవరణ చేయాలని అనేకమార్లు డిమాండ్ చేశామని చెప్పారు. ఏపీలో కలిపిన ఏడు మండలాలను తెలంగాణలో కలుపాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలు గడ్డి మందును నిషేధించడంతో కేంద్రం ఆ దిశగా చొరవ చూపాలని వినోద్కుమార్ డిమాండ్ చేశారు.