హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి పబ్లిక్ సెక్టార్ యూనిట్ల (పీఎస్యూ) ప్రైవేటీకరణ పరంపర కొనసాగుతున్నదని, చివరికి రక్షణ రంగ సంస్థకూ ప్రైవేటీకరణ గండం తప్పడం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాలబాటలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడమే బీజేపీ సిద్ధాంతమని మండిపడ్డారు. మేకిన్ ఇండియా ముసుగులో పీఎస్యూలను ప్రైవేట్బాట పట్టిస్తున్నారని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పరిరక్షణ జేఏసీ నాయకులు తనతో సమావేశమైన సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడారు. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి వర్ ఆర్డర్ ఇవ్వకుండా సిక్ యూనిట్గా చిత్రీకరించి మూసివేసే కుట్రలు జరుగుతున్నాయని, వాటిని తిప్పికొడదామని చెప్పారు. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో యుద్ధ ట్యాంకర్లు, బుల్లెట్ ప్రూఫ్, ల్యాండ్ మైన్స్ ప్రూఫ్ వాహనాలు, లాంచర్లు వంటి దేశ రక్షణ కోసం కీలక ఉత్పత్తులు తయారవుతాయని చెప్పారు. ఫ్యాక్టరీకి వర్ ఆర్డర్ ఇవ్వాలని, అక్కడ పనిచేస్తున్న సుమారు మూడున్నర వేల మంది ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడటం మానుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జేఏసీ నాయకులు రమణారెడ్డి, ప్రభు, శ్రీనివాస్రెడ్డి, రవీందర్గౌడ్, శివకుమార్, రాజయ్య, యాదగిరి, అశోక్, మల్లికార్జున్రెడ్డి, ప్రభు, శివశంకర్నాయక్, బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాంబాబుయాదవ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.