రాజన్న సిరిసిల్ల :కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ(BJP)కి చెందిన నలుగురు ఎంపీలు రాష్ట్రానికి అధనంగా నాలుగు పైసలు కూడా తీసుకురాలేదని ప్రణాళిక సంఘం (Planning board) ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్కుమార్ ఆరోపించారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla)లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్ ఎంపీగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్లమెంట్ నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు ఏం తెచ్చావని బండి సంజయ్ ను ప్రశ్నించారు.
కనీసం రైల్వే లైన్ పనులు కూడా ముందుకు తీసుకెళ్లకపోగా, జిల్లాకు నవోదయ విద్యాలయాన్ని ఎందుకు తీసుకు రాలేదని నిలదీశారు. మూడు లక్షల జనాభా ఉన్న కరీంనగర్ కు ఎంపీగా ఉన్న సమయంలో వెయ్యి కోట్లు నిధులు తీసుకొచ్చి స్మార్ట్ సిటీ పనులు చేయించానని గుర్తు చేశారు. రాష్ట్రంలో కుటుంబ పాలనపై నరేంద్ర మోదీ(Narendra Modi) చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
బీజేపీలో వందమంది ఎంపీలకు చెందిన కుటుంబ సభ్యులు రాజకీయంగా, ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్నారని విమర్శించారు. ఇందులో తప్పేమీ ఉందన్నారు. ప్రధానికి మాత్రం అదానీ(Adani), అంబానీ(Ambani) పెద్ద కుటుంబమని మండిపడ్డారు. కేటీఆర్, కవిత, హరీశ్ మొదటి నుంచి రాష్ట్ర ఉద్యమంలో పనిచేశారని పదవుల కోసం కాదని స్పష్టం చేశారు. రానున్నది ఎన్నికల సమయని అక్టోబర్ గాని డిసెంబర్లో గాని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ముందు చూపుతో జరుగుతున్న అభివృద్ధిపై గొప్ప గొప్ప ఆర్థికవేత్తలు అధ్యయనం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం రూ. 3 లక్షల 17 వేలకు చేరిందని అన్నారు. కార్యకర్తలు, నాయకులు అందరూ మరింత కష్టపడి పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకు రావడానికి శక్తివంచన లేకుండా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, జడ్పీటీసీలు రవి, మీనయ్య తదితరులు పాల్గొన్నారు.