తిమ్మాపూర్ రూరల్, డిసెంబర్ 22 : కాంగ్రెస్ అబద్ధపు హామీల(False promises)పై గ్రామాల్లో చర్చపెట్టాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్( Boinapalli Vinodkumar )బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీల అమలు కోసం మరోపోరాటానికి సిద్ధం కావాలన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే హామీలను నెరవేరుస్తామని తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన విధానాన్ని ఎండగట్టాలన్నారు. అధికారంలోకి వచ్చాక రైతుబంధు, నిరుద్యోగ భృతిపై మాట మార్చారని దుయ్యబట్టారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
సెంటిమెంట్ను రెచ్చగొట్టి గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన బండి సంజయ్ నియోజకవర్గానికి ఏం చేశాడా చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో వారి పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా నయాపైసా తేలేదని విమర్శించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గడ్డం నాగరాజు, గూడేల్లి తిరుపతి, సిద్ధం వేణు, రావుల రమేష్, కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.