హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మార్గదర్శకాలను అనుసరించే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో ఉద్యోగాల నియామలు, పదోన్నతుల ప్రక్రియ చేపడతామని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. హైదరాబాద్లో సోమవారం నిర్వహించిన కాలుష్య నియంత్రణ మండలి బోర్డు సమావేశంలో ఆమె మా ట్లాడుతూ.. పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత అంశాలపై కాంట్రాక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. నాలా క్లీనింగ్ ప్రభావం అన్ని ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా నిర్ధారించనున్నట్టు తెలిపారు. సింగిల్యూజ్ ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయాల ప్రచారంలో ఇంటి నుంచి పనిచేసే మహిళా స్వయం సహాయక బృందాల ప్రమేయాన్ని ప్రోత్సహించాలని సూచించారు. పరిశ్రమల తరలింపు తప్పనిసరి అయితే అనువైన భూములను గుర్తించాలని ఆదేశించారు. తొలుత బోర్డు అధికారులు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్తోపాటు వాయు, నీటి కాలుష్యానికి సంబంధించిన పర్యావరణ నాణ్యత పర్యవేక్షణ, పర్యావరణ సమ్మతిని నియంత్రించడం వంటి అంశాలతోసహా బోర్డు పనితీరుపై ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి ఎండీ, సభ్య కార్యదర్శి కృష్ణ ఆదిత్య, చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ రఘు తదితరులు పాల్గొన్నారు.