Hyderabad | హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు మరో దిగ్గజ ఫార్మా కంపెనీ తరలి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద టాప్ 10 ఫార్మా కంపెనీల్లో ఒకటైన బ్రిస్టల్ మైయర్స్ స్కిబ్ (బీఎంఎస్) హైదరాబాద్లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. అమెరికాకు చెందిన బీఎంస్ సంస్థ ఔషధాల అభివృద్ధి, ఐటీ, ఇన్నోవేషన్ రంగాల్లో తమ కార్యకలాపాల నిర్వహణకు వచ్చే మూడేండ్లలో 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ.828 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామావు వెల్లడించారు. ఫలితంగా కొత్తగా 1500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.
ఈ మేరకు గురువారం బేగంపేటలోని గ్రీన్పార్క్ హోటల్లో బీఎంఎస్ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణకు బీఎంఎస్ను ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉన్నదన్నారు. తెలంగాణలో బయో టెక్నాలజీ లైఫ్సైన్సెస్ రంగం బలంగా ఎదుగుతున్నదని, 2028 నాటికి రాష్ట్రంలోని లైఫ్సైన్సెస్ ఎకో సిస్టమ్ విలువను రెట్టింపు చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా బీఎంఎస్ అవగాహన ఒప్పందం ఉన్నదని చెప్పారు. ఈ రంగంలో వంద బిలియన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ యువతకు ఈ సంస్థ ఏర్పాటు ఒక గొప్ప అవకాశమని చెప్పారు.
బయో ఏషియా సదస్సు ప్రారంభానికి ముందే.. బీఎంఎస్ వంద మిలియన్ డాలర్ల పెట్టుబడితో హైదరాబాద్కు రావడం శుభసూచకమన్నారు. ఇప్పటివరకు ఇండియాకు రాని ఓ కొత్త కంపెనీ మన దేశంలోకి రావడం.. బయో టెక్నాలజీ, ఐటీకి గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్లో దాని కార్యకలాపాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. మన దగ్గర పెట్టుబడులు పెట్టి.. కంపెనీలు స్థాపించిన వారంతా మొదట 1000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారని, కానీ అనతికాలంలోనే మూడు వేలకుపైగా ఉద్యోగాలు కల్పించారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. అదే కోవలో బీఎంఎస్ కూడా ఎక్కువ సంఖ్యలో కొత్త ఉద్యోగాలు సృష్టిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎవరైనా ఇండియాలోని ఏదైనా ఒక ప్రాంతంలో కొత్తగా ఒక ఫార్మా యూనిట్ పెట్టాలనుకుంటే 12 నుంచి 18 నెలల పడుతుందని, కానీ, హైదరాబాద్ ఫార్మాసిటీకి ఉన్న పర్యావరణ అనుమతులతో కేవలం నెలల వ్యధిలోనే పనులు ప్రారంభించవచ్చని తెలిపారు. వీటితో పాటు హైదరాబాద్లో ఉండే వివిధ అనుకూలతల గురించి బీఎంఎస్ ప్రతినిధులకు క్షుణ్ణంగా వివరించామని, భవిష్యత్తులో వారు మరిన్ని పెట్టుబడులు పెడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాలో బాగా పేరున్న ఫార్మాస్యూటికల్ కంపెనీ మన దగ్గర పెట్టుబడులు పెట్టి, కొత్తగా ఉద్యోగాలు కల్పించడం మనకూ గొప్పవిషయమేనన్నారు. ఆధునిక టెక్నాలజీని, బయాలజీని కలిపి వారు చేస్తున్న అద్భుతాలు.. త్వరలో తెలంగాణలో కూడా ఆవిష్కృతం కానున్నాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు హైదరాబాద్ను ఓ గొప్ప ఫార్మా క్లస్టర్గా తీర్చిదిదుతున్నట్టు మంత్రి వివరించారు.
ఊహించనంత అభివృద్ధిని చూశా..
బీఎంఎస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సమిత్ హీరావత్ మాట్లాడుతూ.. ‘మా కంపెనీ ఫార్మాస్యూటికల్స్, బయో టెక్నాలజీ, వైద్యరంగంలో అనేక సేవలను అందిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వ్యాధులను నయం చేయడానికి అవసరమైన మందులను కనుగొని, వాటిని అభివృద్ధి చేసి, పంపిణీ చేస్తుంటాం. ఆంకాలజీ, హెమటాలజీ, ఇమ్యునాలజీ, కార్డియోవాస్కులర్ రోగాలకు సంబంధించిన మందులను అభివృద్ధి చేస్తుంటాం. తెలంగాణలో యువత లైఫ్సైన్సెస్లో చాలా ప్రతిభను కలిగి ఉన్నారు. అందుకే మేము తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాం. నేను ఐదేండ్ల క్రితం చూసిన హైదరాబాద్కు.. ఇప్పటి హైదరాబాద్కు పోలికే లేదు.
ఊహించనంత అభివృద్ధి జరిగింది. మేము గత జనవరిలో హైదరాబాద్ను సందర్శించినప్పుడే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నాం. మా ఆలోచన చెప్పిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని ఆహ్వానించడం, క్లియరెన్స్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇతర టెక్నాలజీ కంపెనీలు, హాస్పిటల్స్తో కూడా కలిసి పనిచేస్తాం. మా కంపెనీ ద్వారా ఐటీ స్పేస్, డ్రగ్ డెవలప్మెంట్, మెడికల్ ట్రైనర్స్, ప్రోగ్రామింగ్, ఆపరేషన్స్, ప్రొటోకాల్ మేనేజర్స్, ఫిజీషియన్స్ వంటి వివిధ విభాగాల్లో ఉద్యోగాలు కల్పిస్తాం. హైదరాబాద్లో ఏర్పాటు చేయబోయే మా యూనిట్ను సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్గా అభివృద్ధి చేస్తాం’ అని వివరించారు. అనంతరం మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఎంఎస్ ప్రతినిధులు, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్ ఎంవో యూ కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ సంస్థ ప్రతినిధులు క్రిష్, ఫ్రాన్సిస్, తెలంగాణ లైఫ్సైన్సెస్ డైరెక్టర్ శక్తినాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.