వరంగల్ చౌరస్తా, సెప్టెంబర్ 20 : కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుంది ఎంజీఎం దవాఖానలో రోగుల పరిస్థితి. రోగికి అవసరమైన రక్తాన్ని కాకుండా ఇతర గ్రూపు రక్తాన్ని ఎక్కించడంతో రోగి ప్రాణాపాయస్థితికి చేరుకున్న ఘటన శనివారం వరంగల్ ఎంజీఎం దవాఖానలో జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం అయోధ్యపురం ప్రాంతానికి చెందిన ఇలాసాగరం జ్యోతి (34) ఈనెల 16న తీవ్రజ్వరం, శ్వాస సంబంధిత సమస్యలతో ఎంజీఎం దవాఖానలో చేరింది. పరీక్షించిన వైద్యులు రక్తం తక్కువగా ఉందని, నమూనాలు సేకరించి బ్లడ్ బ్యాంకుకు పంపగా బీ పాజిటివ్గా నిర్ధారించారు. కేస్ షీట్తోపాటు రిక్వేషన్ పత్రంపై ముద్రలు వేసి పంపించారు. నిబంధనల ప్రకారం వైద్యులు వెళ్లి బ్లడ్ బ్యాంకు నుంచి సేకరించిన బ్లడ్ ప్యాకెట్ను బాధితురాలికి ఎక్కించారు. అప్పటికే బాధితురాలు తనది ఓ పాజిటివ్ అని తెలియజేసినా సిబ్బంది పట్టించుకోకుండా నమూనాలు సేకరించిన తర్వాత బీ పాజిటివ్గా గుర్తించామని బుకాయిస్త్తూ రక్తం ఎక్కించారు. మరుసటి రోజు (18వతేదీ)న సైతం మరో బీ పాజిటివ్ బ్లడ్ గ్రూపు ప్యాకెట్ను ఎక్కించా రు.
దీంతో బాధితురాలికి వాంతులు, విరోచనాలు, ఒంటిపై దద్దుర్లు కనిపించడంతో బాధితురాలి కుటుంబసభ్యులు వైద్యులకు విషయాన్ని తెలియజేశారు. వెంటనే స్పందించిన వైద్యులు తిరిగి నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహించగా బాధితురాలిది ఓ పాజిటివ్గా తేలింది. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు పాటించే యత్నాలు చేస్తూ, అధికారులు వైద్యం ప్రారంభించారు. బాధితురాలు చెబుతున్నా పట్టించుకోకుండా వైద్యసిబ్బంది నిర్లక్ష్యం వహించడం, బ్లడ్బ్యాంకులో నమూనాలు పరీక్షించే సమయంలో నిర్లక్ష్యం చేయడంపై రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ను వివరణ కోరగా.. రోగి శరీరంలో హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ మూలంగా రక్తం మార్పు చెందే అవకాశం ఉందని, తమ తప్పేమి లేదని పేర్కొన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపి, వైద్య సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.