హైదరాబాద్, జూలై 13(నమస్తే తెలంగాణ): ‘రేవంత్రెడ్డి.. మా రక్తం తీసుకొని నీ రక్తదాహం తీర్చుకో.. కానీ కండ్ల ముందర పంటలు ఎండిపోయి కన్నీళ్లు పెడుతున్న రైతాంగానికి నీళ్చిచ్చి ఆదుకో’ అంటూ బీఆర్ఎస్వీ డిమాండ్ చేసింది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి, యూత్ విభాగాలు సోమవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో ‘రేవంత్రెడ్డికి రక్తదానం’ పేరిట బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, టీజీపీ ఎస్సీ, బీసీ కమిషన్ మాజీ మెంబర్లు సుమిత్రా ఆనంద్, కే కిశోర్గౌడ్, బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షులు తుంగ బాలు, పడాల సతీశ్, దశరథ్, స్వామియాదవ్, జంగయ్య తదితరులు హాజరయ్యారు. సుమారు 50 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ హంతక భాషపై వారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతాంగానికి నీళ్లివ్వని ఈ చేతగాని కాంగ్రెస్ సర్కార్ పాలించే అర్హత కోల్పోయిందని దుయ్యబట్టారు.
బీఆర్ఎస్స్వీ నేతలపై పోలీసు జులుం
బీఆర్ఎస్వీ కార్యకర్తల నుంచి సేకరించిన రక్తం ప్యాకెట్లతో బయల్దేరిన నాయకులపై పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ భవన్ గేటు బయట మోహరించిన పోలీసులు బారికేడ్లు పెట్టి నిలువరించారు. బలవంతంగా నెట్టివేస్తూ జులుం ప్రదర్శించగా నాయకులు తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్వీ నాయకులు గేటు బయట బైఠాయించి నిరసన తెలిపారు. ‘ఆంధ్రాకు నీళ్లు-తెలంగాణకు కన్నీళ్లా..? కాంగ్రెస్ సర్కార్ ఖబడ్దార్.. రేవంత్రెడ్డికో హఠావో..తెలంగాణకు బచావో..’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. పెద్దసంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. బీఆర్ఎస్వీ ముఖ్యనాయకులను అదుపులోకి తీసుకొని రెండు వాహనాల్లో అంబర్పేట, ఫలక్నుమా ఠాణాలకు తరలించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్, తుంగ బాలు, పడాల సతీశ్ మాటాడుతూ రైతుల తరఫున గొంతెత్తిన తమను అణచివేయాలని చూ డటం దారుణమని, పోరాటంతో నిరంకుశ సర్కార్ మెడలు వంచుతామని హెచ్చరించారు.