సిటీబ్యూరో, మే 18(నమస్తే తెలంగాణ): లాక్డౌన్ నిబంధనలే కాదు.. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినా కొరడా ఝళిపిస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. లాక్డౌన్ అమలులో ఉన్న వేళలో, సడలింపు ఇచ్చిన సమయంలో కొంతమంది యథేచ్ఛగా ట్రాఫిక్ రూల్స్ను గాలికొదిలేసి వాహనాలు నడుపుతున్న వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం నిఘా పెంచింది. ఈ నేపథ్యంలోనే గత ఆరు రోజులుగా లాక్డౌన్, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 60వేల మందికి చలానాలు జారీ చేశారు.
సీసీ కెమెరాల ద్వారా ఉల్లంఘన దారులను గుర్తించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. సైబరాబాద్ పరిధిలో సమీకృత ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ సహకారంతో పది ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల అధికారులతో కూడిన ట్రాఫిక్ సెల్ ఉల్లంఘనులను గుర్తించే పనిలో పడింది. 6 రోజులుగా అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నియమాలను పట్టించుకోకుండా తిరిగిన 60వేల మందిని గుర్తించారు. వీరిలో అత్యధికంగా మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 8168 మందికి చలానాలు జారీ అయ్యాయి.
లాక్డౌన్ సడలించిన వేళల్లో సైబరాబాద్ పరిధిలో గత 6 రోజులుగా 14 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇద్దరు వాహనదారులు మరణించారు. 17 మంది తీవ్ర గాయాలకు గురయ్యారు. ఈ ప్రమాదాలన్నీ ఉదయం 6 నుంచి 10 మధ్యనే జరిగాయి. గమ్యస్థానాలకు త్వరగా చేరుకునే క్రమంలో వేగంగా వాహనాలను నడపడమే ఇందుకు కారణమని పోలీసులు గుర్తించారు. కాగా సురక్షిత ప్రయాణానికి నగరవాసులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు జారీ చేశారు.