హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎరవేసిన కేసులో బహిర్గతమైన వీడియోల్లో.. ఈ డీల్ మొత్తం పార్టీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ కనుసన్నల్లోనే సాగుతున్నదని నిందితులు చెప్పారు. బీజేపీలో సంతోష్ చెప్పిందే వేదమని, ఆయనకు ఆర్ఎస్ఎస్ ఆ అధికారాలు ఇచ్చిందని ఆకాశానికెత్తారు. అంతేకాదు.. రామచంద్రభారతిని కింగ్ మేకర్గా అభివర్ణించారు. మొత్తంగా ఈ వీడియోలో తెలంగాణతోపాటు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎలా కూలగొట్టాలనుకొంటున్నారో, మహారాష్ట్రలో ఎలా కూల్చారో స్పష్టంగా వివరించారు.
కుట్ర మొదలైందిలా..!
మొయినాబాద్ ఫామ్హౌజ్ ఘటన జరుగటానికి నెల రోజుల ముందే నందు, సింహయాజీ కలిసి ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డిని సంప్రదించారు. ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. రామచంద్రభారతికి ఫోన్ చేయించి నేరుగా మాట్లాడించారు. హైదరాబాద్కు రావాలని రోహిత్రెడ్డి కోరగా, తనకు ఆరోగ్యం బాగాలేదని, ప్రస్తుతం బెడ్ రెస్ట్లో ఉన్నానని రామచంద్రభారతి చెప్పాడు. మునుగోడు ఎన్నికల లోపు ఏదో ఒక సంచలనం జరగాలని, టీఆర్ఎస్ను మానసికంగా దెబ్బకొట్టాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్టు చెప్పాడు. బీజేపీలో చేరేవారి రాజకీయ భవిష్యత్తుకు తనది హామీ అని, వ్యక్తిగత రక్షణ బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం చూసుకొంటుందన్నాడు.
ఏపీలో రఘురామకృష్ణంరాజుకు ఎలాగైతే వై క్యాటగిరీ భద్రత కల్పించామో.. ఇప్పుడు చేరబోయే ఎమ్మెల్యేలకు కూడా అదే విధంగా భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. తన బెడ్రెస్ట్ అక్టోబర్ 23తో అయిపోతుందని, 24న దీపావళి, 25న గ్రహణం ఉన్నందున 26న వస్తానని చెప్పాడు. 26న అందరూ మొయినాబాద్ ఫామ్హౌజ్లో కలుసుకొన్నారు. రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ ఫామ్హౌజ్కు చేరుకున్న తర్వాత ఎమ్మెల్యే రోహిత్రెడ్డి వారిని లోపలికి తీసుకెళ్లారు. తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్రెడ్డి, రేగా కాంతారావు ఫామ్హౌజ్కు వచ్చారు. రోహిత్రెడ్డి వారిని ఆర్సీబీకి పరిచయం చేశారు. ఆర్సీబీ సంతోష్కు ఫోన్చేసి ఆ ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు, నియోజకవర్గ వివరాలను తెలుపడంతో సంతోష్ నిర్ధారించుకున్నాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ముగ్గురు నిందితుల మధ్య మాటలు మొదలయ్యాయి.
ఆర్సీబీ.. కింగ్ మేకర్
మొదట బేరసారాల కోసం వచ్చిన వారిలో ముఖ్యవ్యక్తి అయిన రామచంద్రభారతి గురించి తెలుసుకొనేందుకు ఎమ్మెల్యేలు పలు ప్రశ్నలు వేశారు. ఆయన ఎవరు? బీజేపీలో స్థానం ఏమిటి? రాజకీయాల్లోకి రాకముందు ఏం చేసేవాడు? అంటూ ఎమ్మెల్యే బాలరాజు ప్రశ్నించారు. దీనికి ఆర్సీబీ జవాబిస్తూ తాను ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చానని చెప్పాడు. వెంటనే సింహయాజి అందుకొని.. ఆర్సీబీ ప్రధానితో కలిసి ఒకే ఫ్లైట్లో రాకపోకలు సాగిస్తాడంటూ గొప్పగా చెప్పాడు. ఆర్సీబీ చిన్నప్పుడే ఏబీవీపీలో చేరాడని, కొంతకాలం సన్యాసం తీసుకొని స్వామీజీగా మారాడని, ఆరోగ్యం సహకరించక బయటకు వచ్చేశాడని వివరించాడు. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకున్నా అంతా వెనకుండి నడిపిస్తాడంటూ ఆర్సీబీని ఓ కింగ్ మేకర్గా అభివర్ణించాడు.
ఆ తర్వాత ఎమ్మెల్యే బాలరాజు బీజేపీలో సంతోష్ పాత్ర ఏమిటని ఆరా తీశారు. దీనికి ఆర్సీబీ స్పందిస్తూ వ్యూహాత్మకంగా రాజకీయ వ్యవహారాలు చూస్తాడని, మీ నలుగురు ఎమ్మెల్యేల బాధ్యత కూడా సంతోష్దేనని, భవిష్యత్తుకు ఢోకా ఉండదని భరోసా ఇచ్చాడు. డబ్బు, రాబోయే ఎన్నికల్లో టిక్కెట్లు వంటి వ్యవహారాలన్నీ సంతోష్, అమిత్షా, జేపీ నడ్డా చూసుకుంటారని, ప్రధాని అన్ని వ్యవహారాలనూ పర్యవేక్షిస్తారని చెప్పాడు. ఎంత ఇస్తారో చెప్తే బాగుంటుందని రోహిత్రెడ్డి కోరగా.. రూ.50 కోట్లు ఇస్తామని ఆర్సీబీ స్పష్టంగా చెప్పాడు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఒక్కటేనా అని బాలరాజు ప్రశ్నించగా, బీజేపీ రాజకీయపార్టీ కాగా, ఆర్ఎస్ఎస్ దాన్ని వెనుక నుండి నడిపిస్తుందని.. బీజేపీ నేతల్లో ఎక్కువగా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినవారేనని ఆర్సీబీ వెల్లడించాడు.
రాజగోపాల్కు రూ.50 కోట్లు
ఆ తర్వాత మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూలదోసిన అంశాన్ని ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ప్రస్తావించారు. సింహయాజి జోక్యం చేసుకొని మహారాష్ట్ర ఆపరేషన్ మొత్తాన్ని తాను, ఆర్సీబీ కలిసి చేసినట్టు వివరించాడు. తాను, ఆర్సీబీ స్నేహితులమని, మహారాష్ర్టే కాకుండా తాము అనేక ఆపరేషన్లు చేశామని గొప్పలు చెప్పాడు. మునుగోడు ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థి రాజ్గోపాల్రెడ్డికి రూ.30 కోట్లు ఇచ్చినట్టు వివరించాడు. ఇంతలో నందు జోక్యం చేసుకొని, ఇప్పటికే రూ.30 కోట్లు ఇచ్చామని, మరో రూ.20 కోట్లు వస్తాయని అన్నాడు. బీజేపీ 15 ఏండ్లు చెక్కు చెదరదని ఆర్సీబీ చెప్పాడు.
సంతోష్కు ఫుల్ పవర్స్..
సంతోష్ ఎవరు? ఎలా ఉంటాడని ఎమ్మెల్యేలు అడుగగా.. ఆయన పంచె కట్టుకొని, తెల్ల చొక్కా వేసుకొని చాలా సింపుల్గా ఉంటాడని సింహయాజి బదులిచ్చాడు. వెంటనే నందు తన ఫోన్ తెప్పించుకొన్నాడు. అందులో సంతోష్ ఫొటోలను ఓపెన్ చేసి గువ్వల బాలరాజుకు చూపించాడు. సంతోష్ నో చెప్తే.. అమిత్ షా కూడా ఏం చేయలేరని, అర్ఎస్ఎస్ ఆయనకు అంతటి అధికారాలు ఇచ్చిందని సింహాయాజి చెప్పాడు. ఏదైనా అవసరముంటే మోదీ, అమిత్షానే ఆయన వద్దకు వెళ్తారన్నాడు. ఇలాంటి వ్యవహరాలను డీల్ చేసేది, ఆపరేషన్స్ చేసేది సంతోషేనని, ఆయన తలుచుకొంటే చిన్న పోస్ట్ నుంచి పెద్ద పోస్ట్ వరకు ఏదంటే అది క్షణాల్లో జరిగిపోతుందని నందు చెప్పాడు.
బండి, కిషన్లకు అపాయింట్మెంటే దొరకదు
తరువాత ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ.. వీళ్లంతా తనకు నెల రోజుల నుంచి టచ్లో ఉన్నారని, క్యాష్ ఎక్కడుందో చెప్తారని, మనం వెళ్లి కన్ఫర్మ్ చేసుకోవాలని గువ్వల బాల్రాజుకు వివరించారు. అప్పుడు గువ్వల జోక్యం చేసుకొని ఢిల్లీ, ఏపీలో ఆపరేషన్ ఏమైందని ప్రశ్నించారు. తెలంగాణలో పూర్తి కాగానే అక్కడ స్టార్ట్ చేస్తామని సింహయాజి చెప్పాడు. ఇక్కడ బండి సంజయ్, కిషన్రెడ్డి పరిస్థితి ఏమిటని, వాళ్లదేమీ నడువదా? అని గువ్వల మళ్లీ ప్రశ్నించారు. ఢిల్లీలో వారికి కనీసం ఆపాయింట్మెంట్ కూడా దొరకదని సింహయాజి అన్నాడు. వాళ్లతో అవడం లేదు కాబట్టే కొత్త వాళ్లను తీసుకొని వాళ్లతో పార్టీని నడిపించాలని ఢిల్లీ పెద్దలు చూస్తున్నారని సింహయాజి వివరించాడు.
ఆర్సీబీకి తుషార్ ఫోన్..
ఇలా ఆర్సీబీ, సింహయాజి, నందు.. నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడుతుండగానే.. తుషార్ నుంచి ఆర్సీబీకి ఫోన్ వచ్చింది. రోహిత్రెడ్డితో డిస్కస్ చేస్తున్నామని, అన్నీ ఫైనలైజ్ అయ్యాయని, పేమెంట్ ఇష్యూ ఒక్కటే మిగిలి ఉన్నదని తుషార్కు ఆర్సీబీ వివరించాడు. ఆ తర్వాత ఫోన్ను రోహిత్రెడ్డికి ఇచ్చాడు. రోహిత్రెడ్డి స్పీకర్ ఆన్ చేశారు. మూడో తేదీన మునుగోడు పోలింగ్ ముగుస్తుంది కాబట్టి, నాలుగు లేదా ఐదో తేదీన కలుద్దామని తుషార్ చెప్పాడు. దీనికి నందకిషోర్ ‘వద్దు వద్దు.. ముందే కలుద్దామని చెప్పండి’ అన్నట్టుగా రోహిత్రెడ్డికి సైగ చేశాడు. దీంతో ఈ రోజే పూర్తిచేయాలని, వీలైతే హైదరాబాద్కు రావాలని రోహిత్రెడ్డి కోరారు. దీనికి తుషార్ స్పందిస్తూ.. బీఎల్ సంతోష్తో మాట్లాడిన తర్వాత కన్ఫర్మ్ చేస్తానని, ఫైనల్ డిస్కషన్లో అందరం కలుద్దామని చెప్పాడు. తర్వాత ఆర్సీబీ ఫోన్ తీసుకొని స్పీకర్ ఆఫ్ చేసి మాట్లాడాడు. ఇద్దరూ కాసేపు మలయాళంలో మాట్లాడుకొన్నారు.
మధ్యలో సంతోష్ పేరును ప్రస్తావించాడు. ఫోన్ మాట్లాడిన తర్వాత.. తుషార్కు సంతోష్, అమిత్షా ఇంకా టచ్లోకి రాలేదని, అమిత్షా గుజరాత్ ఎన్నికల సభలో ఉన్నారని, కొద్దిసేపట్లో లైన్లోకి వస్తారని, ఈ విషయం సాకేత్ (అమిత్షా వ్యక్తిగత కార్యదర్శి) దృష్టిలో కూడా ఉన్నదని చెప్పాడు. కొనుగోలు చేసిన ప్రజా ప్రతినిధులకు డబ్బు ఎలా ముట్టజెప్తారో ఆర్సీబీ క్షుణ్ణంగా వివరించాడు. ‘ముందు మేము కలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత వారిని ఢిల్లీకి తీసుకెళ్తాం. మా మనిషి వాళ్లను నేరుగా సంతోష్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత డబ్బు ముట్టజెప్తాం’ అని చెప్పారు. మొట్ట మొదటిసారిగా ఇక్కడే (తెలంగాణలో- హైదరాబాద్లోనే) 50 శాతం అడ్వాన్స్ ఇస్తున్నట్టు తెలిపాడు.
సంతోష్ చేతిలోనే ఢిల్లీ ఆపరేషన్..
ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆపరేషన్ను సంతోష్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు ఆర్బీబీ తెలిపాడు. కేజ్రీవాల్ రైట్ హ్యాండే తమ వెంట ఉన్నాడని, మొత్తం 36 మందిని పట్టేశామని చెప్పాడు. సింహయాజి స్పందిస్తూ.. అక్కడ గవర్నర్ నా శిష్యుడు అని అన్నాడు. బీజేపీ నుంచి ఒకరు సీఎం అవుతారని, అప్ నుంచి ఒకరు డిఫ్యూటీ సీఎం అవుతారని, చర్చలు కూడా అయిపోయాయని కుట్రను బయటపెట్టాడు. ఆ తర్వాత అందరూ కలిసి చాయ్ తాగారు.
కర్ణాటకలో వేషాలు వేయించాం
తాము కర్ణాటక ఆపరేషన్ చేసినప్పుడు.. 16 మందితో ప్రభుత్వాన్ని కూలగొట్టినట్టు ఆర్సీబీ వివరించాడు. ఎమ్మెల్యేలు పంచెలు కట్టుకొని, గడ్డపారలు పట్టుకుని ట్రాక్టర్లలో కూలీల వేషంలో ఫాంహౌజ్కు వచ్చారని, అక్కడి నుంచి నేరుగా చెన్నైకి తీసుకెళ్లామని.. అక్కడి నుంచి ఇండిగో ఫ్లైట్లో ముంబైకి తీసుకెళ్లామన్నాడు. వాళ్లకు హామీ ఇచ్చిన డబ్బులు అక్కడే డెలివరీ చేశామని వివరించాడు. అంతటా ఇలాంటి ప్రొసీజరే ఫాలో అవుతుంటామని పూసగుచ్చినట్టు వివరించాడు.‘నేను సాధారణంగా ఎంటర్ అవ్వను. ఎంటర్ అయితే పనిని ముగించకుండా ఉండను’ అని ఆర్సీబీ తన గురించి గొప్పలు చెప్పుకొన్నాడు. ‘మీరు నా చేతిలో పడ్డారు. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లే బాధ్యత నాది’ అని వాగ్దానం చేశాడు. గువ్వల బాలరాజుకు మంత్రి పదవి వస్తుందని ఆశ పెట్టాడు. ఈ చర్చ జరుగుతుండగానే నందుకు ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడటానికి నందు బయటకు వెళ్లాడు.
ఇక్కడ 50%.. ఢిల్లీలో 50%
అందరూ కొద్దిసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకున్న తర్వాత ఆర్సీబీ వాష్రూమ్కు వెళ్లాడు. సింహయాజి ఒక్కడే ఎమ్మెల్యేలతో సంభాషణ సాగించాడు. తిరుపతిలోని తన పీఠం, విద్యాభ్యాసం, తన కుటుంబ విషయాలను ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్న కొద్దీ జవాబులు ఇచ్చుకుంటూ పోయారు. ఈ మధ్యలోనే నందు కూడా గది లోపలికి వచ్చి కూర్చున్నాడు. స్వామిజీతో కలిసి ఆ సంభాషణ సాగిస్తుండగా అప్పటివరకు బయటకు వెళ్లిన ఆర్సీబీ తిరిగి మళ్లీ ఆ గదిలోకి వచ్చాడు. వస్తూనే ‘ఇప్పటివరకు తుషార్తో మాట్లాడాను. తుషార్ ఈ విషయాన్ని సంతోష్కు చెప్పారు. మీరు ఢిల్లీకి వచ్చిన తర్వాతే మొత్తం డబ్బు ఇద్దామని, ముందే అంటే ఎలా ఇవ్వగలుగుతామని వాళ్లు చర్చిస్తున్నారు.
అమిత్ షా తర్వాత మాట్లాడుదామని అన్నారట. కచ్చితంగా ఎప్పుడనేది చెప్పలేదు. సంతోష్ కూడా ఢిల్లీలోనే డెలివర్ చేద్దామని అంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇలా అడగలేదట. మనం మాత్రమే ఇక్కడే ఇవ్వాలని అంటున్నాం’ అంటూ ఎమ్మెల్యేలకు వివరించాడు. ఆ తరువాత ఇదే అంశంపై ఎమ్మెల్యేలతో నందు, ఆర్సీబీ పదే పదే చర్చించారు. చివరకు ఆర్సీబీ మాట్లాడుతూ డబ్బులు హైదరాబాద్లో 50 శాతం ఇవ్వాలని, మిగతాది అక్కడ ఇవ్వాలని చెప్పాను. వాళ్లు అంగీకరించారు. సంతోష్ మాత్రం.. ఢిల్లీ నుంచి ఆపరేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాకే ఇద్దామని అంటున్నాడట. ఈ అంశంపై అమిత్ షాతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం చెప్తానన్నాడు. అమిత్ షాకు ఫోన్ చేస్తే కలవడం లేదని తుషార్ చెప్పారు. నాకు తెలిసి ఈ రాత్రికి అందుబాటులోకి వస్తారు’ అంటూ ముగించాడు. దీనిపై ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అంతా సవ్యంగా సాగుతుందా? అని అనుమానం వ్యక్తం చేశారు. దానికి సింహయాజి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.
చక్కెర వద్దు.. బెల్లం వేయండి..
ఈ మధ్యలోనే రామచంద్రభారతి ఫోన్ పట్టుకొని మళ్లీ గది నుంచి బయటకు వెళ్లిపోయాడు. అప్పటివరకు బయటకు వెళ్లిన రేగా కాంతారావు మళ్లీ గదిలోపలికి వచ్చారు. ఎమ్మెల్యేలు ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచాలంటూ లేవనెత్తిన సందేహలు, అడిగిన ప్రశ్నలకు సింహయాజి జవాబులు చెప్పాడు. ‘మహారాష్ట్రలో ఎట్లా సాధ్యమైంది? ఎలాంటి అనుమానం అక్కర్లేదు’ ఎమ్మెల్యేలకు సింహయాజి హామీ ఇచ్చాడు. ఈలోగా బయట నుంచి ఆర్సీబీ మళ్లీ గదిలోపలికి వచ్చినట్టే వచ్చి ఆ వెంటనే మళ్లీ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని బయటకు వెళ్లిపోయాడు.
గదిలో ఉన్న ఎమ్మెల్యేలు, సింహయాజి, నందు డ్రింక్స్ తీసుకుంటుండగా, ఆర్సీబీ లోపలికి వచ్చాడు. సోఫాలో కూర్చుంటూనే ‘అమిత్షా ఇప్పటికీ లైన్లోకి రావడం లేదు’ అంటూ ఎమ్మెల్యేలకు చెప్పాడు.. తరువాత డ్రింక్ కాకుండా పాలను తీసుకొన్నాడు. చక్కెర కాకుండా బెల్లం వేసి తీసుకురావాలని అక్కడి సప్లయర్స్కు సూచించాడు. తరువాత అందరూ కలిసి కొన్ని నిమిషాల పాటు పిచ్చాపాటిగా ఇతర విషయలు మాట్లాడుకొన్నారు. తరువాత ఎమ్మెల్యేలు మళ్లీ అసలు విషయాన్ని మొదలుపెట్టగా, ఆర్సీబీ, సింహయాజీ సమాధానం ఇస్తూ వచ్చారు. నందు మాత్రం తనకేమీ పట్టనట్టుగా ఫోన్ చూస్తూ కూర్చుండిపోయాడు. తరువాత రాజాసింగ్, ఆర్ఎస్ఎస్ తదితర అంశాలపై ఎమ్మెల్యేల ప్రశ్నలకు ఆర్సీబీ వారికి సమాధానం చెప్తూ వచ్చాడు. ఇలా ఈ వీడియోల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు ఎలాంటి కుట్రలు చేస్తారో, ప్రజా ప్రతినిధులను ఎలా కొనుగోలు చేస్తారో, ఢిల్లీలో ఎవరితో కలిపిస్తారో వంటి వివరాలన్నింటినీ నిందితులు ఘనంగా చెప్పుకొచ్చారు.
ఢిల్లీ పోలీసు కమిషనర్ ఎవరో ముందే తెలుసు..
ఢిల్లీ పోలీసు కమిషనర్గా రాకేశ్ ఆస్థానా తర్వాత ఎవరు రావాలన్నది కూడా తామే నిర్ణయించామని రామచంద్రభారతి ఎమ్మెల్యేలతో చెప్పాడు. సంజయ్ అరోరా అయితే బాగుంటుందని తాము భావించామని, అదే విషయాన్ని అమిత్షాకు చెప్పామని, తాము చెప్పిన పేరే ఫైనల్ అయ్యిందని, ఆరోరా పోలీసు కమిషనర్ అవ్వడానికి మూడు రోజుల ముందే తమకు ఆ సంగతి తెలుసన్నాడు. తాను ఇదే విషయాన్ని ఢిల్లీ బీజేపీ నేతలతో కూడా చెప్పానంటూ ఫోన్ తీసి రామచంద్రభారతి చూపించాడు. దేశంలో ముఖ్యమైన పోస్టింగులన్నీ కూడా తామే చూస్తామని చెప్పుకొచ్చాడు.
ఢిల్లీ పోలీస్ కమిషనర్గా సంజయ్ అరోరా నియమితులు కానున్నట్టు రెండు రోజులు ముందుగానే ఆనంద్ అనూ అనే వ్యక్తికి రామ్చంద్రభారతి చేసిన మెసేజ్.