BJP | హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ‘మనం ఈ నవంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్నామా? లేక మరో ఐదేండ్ల తర్వాత 2028లో జరుగబోయే ఎన్నికలకు సిద్ధం అవుతున్నామా?’ రాష్ట్రంలోని బీజేపీ నేతలు, కార్యకర్తల మనసుల్లో మెదులుతున్న సందేహం ఇది. రాష్ట్ర నాయకత్వం ఎన్నికల సన్నద్ధతపై శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. షెడ్యూల్ ఖరారైనా, ఎన్నికలకు ఇంకా నెలన్నర మాత్రమే ఉన్నా రాష్ట్ర నాయకత్వం నత్తకు నడకలు నేర్పుతున్నట్టు వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించి, ప్రచారంలో దూసుకుపోతుండగా, కాంగ్రెస్లో అభ్యర్థుల ఖరారు తుది దశకు చేరింది. పేర్లు ప్రకటించకపోయినా కనీసం గల్లీలో, ఢిల్లీలో వాళ్లు హడావుడి చేస్తున్నారని, కానీ.. బీజేపీలో ఇప్పటివరకు కనీసం ఒక్క అభ్యర్థి కూడా ఖరారు కాలేదని వాపోతున్నారు. ‘వ్యూహాత్మకంగా సరైన సమయంలో అభ్యర్థులను ప్రకటిస్తాం’ అంటూ ఏదో మాయమాటలు చెప్పడం తప్ప జాబితా ఏ దశలో ఉన్నది? ఏ తేదీన ప్రకటిస్తారనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియదని ఓ నాయకుడు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తాము ఎవరి పేరు చెప్పి ప్రజల్లోకి వెళ్లాలని ప్రశ్నించారు. ‘మీ అభ్యర్థి ఎవరు?’ అని అడిగితే సమాధానం చెప్పలేక సతమతం అవుతున్నామని వాపోయారు. మ్యానిఫెస్టో ఓ బ్రహ్మపదార్థంగా తయారైందని మరో కార్యకర్త వ్యాఖ్యానించారు. బీజేపీ గెలిస్తే ఫలానా పనులు చేస్తామంటూ ఇప్పటివరకు కనీసం ఒక్క లీక్ కూడా ఇవ్వలేదని, మ్యానిఫెస్టో లేకుండా ప్రజలకు ఏం చెప్తామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ఏ నేతను అడిగినా తమ పార్టీ పరిస్థితి సమాధానం లేని అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయిందంటున్నారు.
కేంద్రమంత్రి కిషన్రెడ్డి బుధవారం ములుగులో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతామని చెప్పారని, దానిని ప్రచారం చేద్దామన్నా ఇప్పటికే రాష్ట్రంలో 10 శాతం అమలవుతుంది కదా అని మరో నాయకుడు పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడికే రాష్ట్రంలో జరిగే పరిణామాలపై అవగాహన లేకపోతే, ఇక మ్యానిఫెస్టోలో కొత్తగా ఏం విషయాలు పెడుతారని అన్నారు. పైగా.. ఏ రోజు, ఏ నాయకుడు పార్టీ మారుతాడో తెలియడం లేదన్నారు.
షెడ్యూల్ రాగానే నేతలు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పరుగులు పెట్టేలా పరిస్థితి ఉండాలని, కానీ తమకు మాత్రం కాళ్లు కట్టేశారని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే డిపాజిట్లు దక్కడం అనుమానంగా ఉన్నదని, ఇలాగే కొనసాగితే బీజేపీకి చరిత్రలోనే అత్యంత ఘోరమైన అవమానం తప్పదనే భావన వారిలో వ్యక్తం అవుతున్నది.