మునుగోడు ప్రజల కోసం, అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రకటించారు. ఇదే విషయమై మునుగోడులో ఓ టీవీ చానల్ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారని ప్రశ్నించగా ఓ వ్యక్తి ఇలా అభిప్రాయపడ్డారు. ‘రాజగోపాల్రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పినవేవీ సాధించలేదు. మాటలు తప్ప.. చేతలు లేవు. బ్రాహ్మణవెల్లంల నుంచి మూడు నెలల్లో నీళ్లు తీసుకొస్తానని మాట తప్పిండు. ఇప్పుడు రాజీనామా చేయటం ఆయన రాజకీయాల కోసమే తప్ప ప్రజల కోసం కాదు. ప్రజలు తెలివి తక్కువవాళ్లు కాదు. మా జమిస్తాన్పల్లిలో 30 మందికి దళితబంధు వచ్చింది. ట్రాక్టర్లతో దున్నుకుంటున్నరు. కార్లు తోలుకుంటున్నరు. ముసలోళ్లు అయితే మాకు కొడుకు లెక్క కేసీఆర్ పింఛన్ ఇస్తున్నడని అంటున్నరు. మళ్ల కేసీఆరే రావాలని కోరుకుంటున్నరు’ అని స్పష్టంచేశారు. దీన్ని బట్టి ప్రజల గుండెల్లో ఎవరికి స్థానం ఉన్నదో స్పష్టమవుతున్నది. కనీసం రెండో స్థానంలోనైనా నిలిచి టీఆర్ఎస్కు ప్రత్యర్థి తామేనని చాటాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నించే అవకాశాలున్నాయి.
నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ వైపు ఉన్నారని ఇప్పటికే అనేక సర్వేల్లో తేలింది. రాజగోపాల్రెడ్డి రాజీనామా ప్రకటించగానే టీఆర్ఎస్ గెలుపు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రాజగోపాల్రెడ్డి మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టలేరని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సైతం తేల్చిచెప్పారు. రాజగోపాల్రెడ్డి సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సైతం ఇటీవల మాట్లాడుతూ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారో తనకు తెలుసని, బయటకు చెప్పనని అన్నారు. ఉప ఎన్నికకు ముందు టీఆర్ఎస్ విజయం ఖాయమైపోయిందనడానికి ఇవీ సంకేతాలు. ప్రస్తుతం అక్కడ రెండో స్థానం కోసమే బీజేపీ, కాంగ్రెస్ పోటీపడనున్నాయి. సిట్టింగ్ అభ్యర్థి రాజగోపాల్రెడ్డిని బరిలోకి దింపి కనీసం రెండోస్థానమైనా సాధించి టీఆర్ఎస్కు అసలైన ప్ర త్యర్థి తామేనని చా టుకోవాలనేది బీజేపీ ఉద్దేశమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దక్షిణ తెలంగాణలోనూ తమకు ఉనికి ఉన్నదని చెప్పుకొనేందుకు ఈ ఉప ఎ న్నిక తీసుకొచ్చారని భావిస్తున్నారు. కాంగ్రెస్ ఎంతమాత్రమూ తమకు ప్రత్యర్థి కాదని చెప్పాలనేది వ్యూహమని పే ర్కొంటున్నారు. సీటు కోల్పోయినా కనీసం రెం డోస్థానంలో నిలిచి తామే టీఆర్ఎస్కు ప్రత్యర్థి అని చెప్పుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నది.
కాంగ్రెస్ను ఖతం చేసేందుకేనా?
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను ఖతం చేసేపనిని బీజేపీ కొంతకాలంగా వ్యూహాత్మకంగా కొనసాగిస్తూ వస్తున్నది. దీంతో అనేక రాష్ర్టాల్లో కాంగ్రెస్ నిస్తేజంగా మారింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, బలంగా ఉన్న కర్ణాటక, కేరళతోపాటు కొంత పట్టున్న తెలంగాణను టార్గెట్ చేస్తున్నది. రాజస్థాన్లో సచిన్ పైలట్, కర్ణాటకలో శివకుమార్ వంటి నేతలపై కన్నేసి పావులు కదుపుతున్నది. తెలంగాణలోనూ కాంగ్రెస్ను ఆటంకంగా భావిస్తున్నది. బలంగా ఉన్న టీఆర్ఎస్ను ఇప్పటికిప్పుడు ఏమీ చేయలేమన్న ధోరణితో కాంగ్రెస్ను గందరగోళం పరిచే పనిని ప్రారంభించింది. ఇందులో భాగంగానే మునుగోడు ఉప ఎన్నిక.
ఉనికి చాటేయత్నంలో బీజేపీ
మునుగోడులో టీఆర్ఎస్కు ఉన్న పటిష్ట పార్టీ యంత్రాంగంతోపాటు సంస్థాగత నిర్మాణం వల్ల అక్కడ టీఆర్ఎస్ను ఓడించలేమన్న విషయంపై బీజేపీ నేతలు స్పష్టమైన అవగాహనతో ఉన్నారని సమాచారం. సిట్టింగ్ స్థానంలో కాంగ్రెస్ను మూడో స్థానానికి పంపి రెండో స్థానంలో నిలువాలన్న వ్యూహంతో బీజేపీ రంగం సిద్ధం చేస్తున్నట్టు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవంగా ఇక్కడ బీజేపీ బలం నామమాత్రం. కొంత పట్టున్న కాంగ్రెస్ను, ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్రెడ్డిని పార్టీ మార్చటం ద్వారా బలహీనపర్చాలని చూస్తున్నది. రాజగోపాల్రెడ్డి వెంట వీలైనంత ఎక్కువ మంది వచ్చేలా చూడాలని భావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్లో గందరగోళం సృష్టించి కార్యకర్తల మనోైస్థెర్యాన్ని దెబ్బతీయాలన్న పట్టుదలతో బీజేపీ కనిపిస్తున్నది. ఉపఎన్నికలో కాంగ్రెస్ను వెనక్కి నెట్టి రెండో స్థానం సాధిస్తే చాలన్నది ప్రధాన వ్యూహంగా కనిపిస్తున్నది. దీంతో వచ్చే సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్కు తామే పోటీ ఇవ్వగలమని చాటాలన్నది ప్రధాన ఉద్దేశం.
ఉప ఎన్నిక ఎందుకోసం?
హుజూర్నగర్లో ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ ఎంపీగా గెలిస్తే ఉప ఎన్నిక వచ్చింది. దుబ్బాకలో ఎమ్మెల్యేగా ఉన్న రామలింగారెడ్డి చనిపోతే ఉప ఎన్నిక అనివార్యమైంది. నాగార్జునసాగర్లోనూ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఉప ఎన్నిక జరిగింది. చివరగా హుజూరాబాద్లో ఈటల రాజేందర్ను టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే రాజీనామాతో ఎన్నిక వచ్చింది. కానీ మునుగోడులో మాత్రం ఏ కారణం లేకుండానే ఉప ఎన్నిక ఖాయమైంది. సోమవారం రాజగోపాల్రెడ్డి రాజీనామా చేయటం, స్పీకర్ ఆమోదించటంతో త్వరలో అక్కడ ఎన్నిక జరగనున్నది. ఇక్కడ ఎన్నిక ఎందుకొస్తున్నది? కారణం ఎవరు? కారకులు ఎవరు? బీజేపీ చెప్పేదొకటి, చేసేదొకటి. పదే పదే ఎన్నికలు, కోడ్తో అభివృద్ధికి ఆంటకం కలుగుతున్నదని వాదిస్తే.. జమిలి ఎన్నికలు పోతామని చెప్తూనే, ఇప్పుడు ఉప ఎన్నికను రుద్దుతున్నారు.