Rajagopal reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు బీజేపీ వ్యూహాలు ఎందుకూ పనికిరావని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తరాది రాష్ర్టాల్లో బీజేపీ అమలు చేస్తున్న వ్యూహాలు కేసీఆర్ సీఎంగా ఉన్న తెలంగాణలో ఏమాత్రం ప్రభావం చూపబోవని స్పష్టం చేశారు. ఇటీవల ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీలో అంతర్గతంగా దుమారం రేపుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తును తేల్చి చెప్పడంతోపాటు బండి సంజయ్ నేతృత్వంలోని రాష్ట్ర నాయకత్వంలో అనేక లోపాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ పెద్దలు తెలంగాణకు ఇన్చార్జీల పేరుతో నలుగురైదుగురు వ్యక్తులను పంపుతున్నారని పేర్కొన్నారు.
అయితే, సరైన ప్రణాళిక ఉన్న ఒక్క నేత చాలంటూ అధిష్ఠానానికి చురకలు అంటించారు. మునుగోడు ఉప ఎన్నికలు ముగిసి ఆరు నెలలు గడిచినా ఏనాడూ తనను పిలిచి మాట్లాడలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. తమ సేవలను వినియోగించుకోవడం లేదని, ఎలాంటి పనులు అప్పగించడం లేదని అసహనం వ్యక్తంచేశారు. బండి సంజయ్ ఒంటెద్దు పోకడలు ప్రదర్శిస్తున్నారని ఎప్పటినుంచో విమర్శలు ఉన్నాయి. ఈ విషయంపై విజయశాంతి గతంలోనే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తంచేశారు. అనేకమంది నేతలదీ ఇదే దారి. ఇప్పుడు కోమటిరెడ్డి కూడా అలాంటి వ్యాఖ్యలే చేయడం పార్టీలో బండి సంజయ్ ధోరణికి నిదర్శనంగా నిలుస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ఎన్నికలు ముగిసి ఆరునెలలైనా తనకు పదవి ఇవ్వలేదన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్లు భగ్గుమంటున్నారు. పార్టీలో చేరిన కేవలం ఆరు నెలల్లోనే ఎవరైనా పదవులు ఇస్తారా? అని మండిపడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల తర్వాత పార్టీ కోసం కోమటిరెడ్డి ఏం చేశారని నిలదీస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం పార్టీలో చేరిన వ్యక్తికి వెంటనే ఎలా పదవులు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ముందునుంచీ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతారంటూ లీకులు ఇస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఒకవేళ నిజంగా వెళ్లిపోవాలనుకుంటే నేరుగా పోవచ్చని, ఇలా బదనాం చేయడం ఏమిటని మండిపడుతున్నారు.