హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): చిన్న వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ముద్ర రుణాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు ఆరోపించారు. ముద్ర రుణాల్లో దేశ సగటు 21.57 శాతంగా ఉంటే.. తెలంగాణలో కేవలం 12.27 శాతానికే పరిమితమైందన్నారు. 3.85 కోట్ల మంది జనాభా ఉన్న తెలంగాణలో కేవలం 47.26 లక్షల మందికే ముద్ర రుణాలు అందినట్టు తెలిపారు. ఇంకా తెలంగాణలో 35.80 లక్షల మంది చిన్న వ్యాపారులకు రుణాలు అందాల్సి ఉన్నదన్నారు. దీనిపై ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినా స్పందించలేదని ధ్వజమెత్తారు. నెల రోజుల్లోగా ఈ రుణాలను మంజూరు చేయకపోతే కేంద్రంతోపాటు రిజర్వు బ్యాంక్పై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తానని హెచ్చరించారు. కేంద్రం సకాలంలో ముద్ర రుణాలను మంజూరు చేయకపోవడంతో చిన్న వ్యాపారులు 5-10% వడ్డీతో ప్రైవేటు వ్యాపారుల వద్ద రుణాలు తీసుకొంటున్నట్టు శ్రీహరిరావు తెలిపారు.