నూతనకల్, ఆగస్టు 24: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ కావాలనే దాడికి పూనుకున్నదని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కలిసి బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అలజడి సృష్టించేందుకు కేంద్రం కట్రలు పన్నుతున్నదని విమర్శించారు. ఎనిమిదేండ్లుగా శాంతి భద్రతల పరిరక్షణకు సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు దేశానికే రోల్ మోడల్గా నిలిస్తే.. శాంతిభద్రతలకు భంగం కలిగించి తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలనే కోణంలో బీజేపీ ఈ మార్గాన్ని ఎంచుకున్నదని విమర్శించారు.
కవిత ఇంటిపై దాడులు జరిపి టీఆర్ఎస్ కేడర్ను రెచ్చగొట్టి ప్రతీకార దాడులు జరిపించుకోవాలన్నదే బీజేపీ వ్యూహంగా కనిపిస్తున్నదని పేర్కొన్నారు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే బీజేపీ పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బండి సంజయ్ పాదయాత్రలో తమ పార్టీ కార్యకర్తలపై బీజేపీ శ్రేణులు దాడి చేశాయని జగదీశ్రెడ్డి తెలిపారు. తాము తలుచుకుంటే రాష్ట్రంలో బీజేపీ నాయకులు తిరుగగలుగుతారా..? అని ప్రశ్నించారు.