నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి సాధ్యమని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి పునరుద్ఘాటించారు. బీజేపీకి ఓటు వేస్తే మన వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టుమని బాండ్ పేపర్ రాసిచ్చినట్టే అని హెచ్చరించారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తరఫున జగదీశ్రెడ్డి సంస్థాన్నారాయణపురం మండలంలో ప్రచారం నిర్వహించారు. మండలంలోని మల్లారెడ్డిగూడెం, గుజ్జ, అల్లందేవ్ చెరువుతోపాటు పలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. బావులకు మీటర్లు తీసుకొచ్చే దొంగలను గ్రామాల్లోకి రానివ్వొద్దని పిలుపునిచ్చారు. మీటర్లు రావద్దంటే కారు గుర్తుకే ఓటేయ్యాలని కోరారు.
నీతి అయోగ్ చెప్పినా తెలంగాణ సంక్షేమ పథకాలకు ఒక్క రూపాయి ఇవ్వని మోదీ, అమిత్షా ఒక్క మనిషి కోసం రూ.18 వేల కోట్లు ఖర్చు పెట్టారన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. రాజగోపాల్రెడ్డికి ఇచ్చిన డబ్బులు నల్లగొండ జిల్లా అభివృద్ధికి ఇస్తే తాము పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటామన్న మంత్రి.. బీజేపీ నాయకులకు దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు వేసిన కేసులతో ఆగిపోయిన లక్ష్మాపురం, చర్లగూడెం-శివన్నగూడెం, డిండి- పాలమూరు వంటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ తదితరులు పాల్గొన్నారు.
సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్లో టీఆర్ఎస్కు జై కొడుతున్న ప్రజలు
టీఆర్ఎస్తోనే అభివృద్ధి
సమైక్య రాష్ట్రంలో వెనకబడిన మునుగోడులో టీఆర్ఎస్ వచ్చాకే అభివృద్ధి మొదలైందని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. కేసీఆర్ సంక్షేమ పథకాలకు ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నదని, మునుగోడులో గెలుపు టీఆర్ఎస్దేనన్నారు. ఎంబీసీ కుల సంఘాలు, సంచార జాతుల సం ఘాలు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.