హైదరాబాద్, జనవరి 4: దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. రోజుకు 30 వేలకు మించి కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనూ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రమాదకర ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. రెండోవేవ్తోనే తల్లడిల్లిన ప్రజలు మూడోవేవ్ గురించి తలుచుకొని భీతిల్లిపోతున్నారు. దేశమంతా ఇంతటి ప్రమాదంలో ఉంటే.. దేశాన్ని ఏలుతున్న బీజేపీ దుర్మార్గపు రాజకీయాలతో మరింత ప్రమాదరక పరిస్థితుల్లోని దేశాన్ని నెడుతున్నది. దేశంలోకి ఒమిక్రాన్ ప్రవేశించకుండా చర్యలు చేపట్టాలని ఎంతమంది మొత్తుకున్నా మొద్దునిద్రపోయిన మోదీ సర్కారు, తీరా అది వచ్చిన తర్వాత హడావిడిగా కొవిడ్ మార్గదర్శకాలు జారీచేసింది. తమ ప్రభుత్వం విడుదలచేసిన మార్గదర్శకాలను బీజేపీయే కాలరాస్తూ దేశవ్యాప్తంగా రాజకీయాలు చేస్తున్నది.
కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభు త్వం కఠినంగా అమలుచేస్తుంటే, బీజేపీ నేతలు వాటిని ఉల్లంఘించి దీక్షలు, ర్యాలీలు చేస్తున్నారు. మొన్న ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష పేరుతో నానా యాగీ చేస్తే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కనీస బాధ్యత లేకుండా మంగళవారం సికింద్రాబాద్లో కొవ్వొత్తుల ర్యాలీ చేస్తానంటూ రాష్ర్టానికి వచ్చారు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్లో సాక్షాత్తూ ప్రధానమంత్రే కరోనా మార్గదర్శకాలను ఉల్లంఘించేందుకు సిద్ధమయ్యారు. పంజాబ్లో గతంలో కనీవినీ ఎరుగని స్థాయిలో బుధవారం ప్రధాని మోదీ రాజకీయ సభ నిర్వహిస్తారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సుభాష్ శర్మ ప్రకటించటం ఆ పార్టీ బాధ్యతారాహిత్య రాజకీయాలకు అద్దం పడుతున్నది. నిజానికి ఆ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం విద్యాసంస్థలను మూసేసింది. రాత్రిపూట కర్ఫ్యూ కూడా విధించింది.