సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
హైదరాబాద్, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ): తెలంగాణలో పండించిన యాసంగి ధాన్యాన్ని కొనకపోతే బీజేపీకి పుట్టగతులు ఉండవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి విమర్శించారు. కేంద్రానికి ఇది పెద్ద మచ్చ తీసుకొస్తుందని స్పష్టం చేశారు. వడ్ల కొనుగోలుపై రాజకీయాలు మానుకొని ధాన్యం కొనడానికి సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణలో రైతుల ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుందని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. వరి వేసుకోవాలని, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. ప్రతి గింజా కొంటాం అని అనేకసార్లు చెప్పారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను ఒప్పించే బాధ్యత బీజేపీ రాష్ట్ర కమిటీపై, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిపై ఉన్నదని తేల్చిచెప్పారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 15 శాతం నుంచి 20 శాతం వరి కోతలు పూర్తయ్యాయని, రైతులు అమ్ముకోడానికి వెళ్లి నిలువు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆదివారం ఒక వీడియో విడుదల చేశారు.