హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి కేంద్రానికి పోతున్న నిధులెన్ని ? తిరిగి కేంద్రం రాష్ర్టానికి ఇస్తున్నవి ఎన్ని ? లెక్కలు తెలుసుకోండి అని ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు సూచించారు. సొమ్ము కేంద్రానిది.. సోకు టీఆర్ఎస్ది అన్న లక్ష్మణ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ గురువారం ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు.
‘ఎవరి సొమ్ముతో ఎవరు సోకులు పడుతున్నారు? తెలంగాణ సొమ్ముతో మీ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న గరీబు ఉత్తరప్రదేశ్ సోకులు పడుతున్నది. తెలంగాణ దేశ అభివృద్ధికి దోహదపడుతున్నందుకు థ్యాంక్స్ చెప్పండి. ఆత్మవంచన చేసుకుంటే మీ ఇష్టం. ప్రజలను మభ్యపెట్టకండి. ఒకనాడు కరువు పీడిత తెలంగాణ ఇవ్వాళ కోటి 35 లక్షల ఎకరాల మాగాణం అయ్యింది. సాగునీరు లేక నెర్రెలు వారిన నేల నేడు పచ్చని పైరులతో కళకళలాడుతూ రికార్డులు సృష్టిస్తున్నది. రైతుబంధు, నిరంతర విద్యుత్తు, సాగునీటి ప్రాజక్టులు, మిషన్ కాకతీయ తదితర పథకాలతో వ్యవసాయం కొత్తపుంతలు తొక్కుతున్నది. తెలంగాణ దేశానికి అన్నం పెడుతున్నది’ అని పేర్కొన్నారు. గడిచిన ఏడేండ్లలో తెలంగాణ ద్వారా కేంద్రానికి లభించిన ఆదాయం, తిరిగి కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధుల వివరాలను కేటీఆర్ ట్విట్టర్లో వెల్లడించారు.