మెదక్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ఉచితాలు వద్దనే బీజేపీని మనం రద్దు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ సర్కారు పెద్దలకు దోచిపెడుతుంటే, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సంపదను పెంచి పేదలకు పంచుతున్నారని చెప్పారు. కార్పొరేట్లు, బడాబాబులకు రూ.10 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన మోదీ సర్కారు.. గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ మాత్రం ఇవ్వలేకపోతున్నదని విమర్శించారు.
మెదక్ శివారులోని పిల్లికోటాల్ సమీపంలో నిరుపేదలకు కేటాయించిన 561 డబుల్ బెడ్రూం ఇండ్లను బుధవారం ఆయన ప్రారంభించారు. లబ్ధిదారులతో సామూహిక గృహ ప్రవేశాలు చేయించారు. అనంతరం మెదక్ పట్టణంలో రూ.5.70 కోట్లతో నిర్మించిన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ను ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో భరోసా సెంటర్ను, హవేళీఘనపూర్ మండలం తొగిటలో రైతాంగ ఉత్పత్తిదారుల సమాఖ్య కేంద్రాన్ని ప్రారంభించారు. బ్రాహ్మణ సంఘం భవనానికి భూమిపూజ చేశారు. మెదక్లోని సెర్ప్ మహిళల ద్వారా మంజీర ఆహార ఉత్పత్తులను ప్రారంభించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం వద్ద ఏర్పాటుచేసిన సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. కులమతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీలు మనకొద్దన్నారు. హిందూ ముస్లింల మధ్య కొట్లాట పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని కొందరు చూస్తున్నారని, ఆ కొట్లాటలు మన కడుపు నింపుతాయా అని ప్రశ్నించారు. కులమతాలకతీతంగా సాయం చేసే చేతులు కావాలని, అది టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నదని పేర్కొన్నారు.
నిరుపేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కష్టపడి పనిచేస్తున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. పెద్దలకు పెట్టేవాళ్లు కావాలా? పేదలకు పెట్టేవాళ్లు కావాలా? అనేది ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. మోదీ సర్కారు దేశంలో 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని తెలిపారు. కృష్ణా జల్లాల్లో వాటాలు తేల్చకుండా బీజేపీ ప్రభుత్వం మోసగిస్తున్నదన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారని, ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదని, అదే తెలంగాణ ప్రభు త్వం లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పారు. 90 వేల ఉద్యోగాలు కొత్తగా భర్తీ చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, కలెక్టర్ ఎస్.హరీశ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారు గిరిజనులు, దళితుల అభివృద్ధికి చేసిందేమీ లేదని రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నిజాంపేట కార్పొరేషన్ పరిధిలోని బ్రహ్మంగారిగుట్టపై రూ.2 కోట్లతో తలపెట్టిన ఎరుకల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఆయన బుధవా రం శంకుస్థాపన చేశారు. అనంతరం సభ లో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ దేశంలో 10.5 కోట్ల మంది గిరిజనులకుగా ను కేంద్ర బడ్జెట్లో 0.02 శాతం నిధులు మాత్రమే కేటాయించగా, తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో రూ.13,413 కోట్లు కేటాయించిందని చెప్పారు. ఇది రాష్ట్ర బడ్జెట్లో 9.5 శాతం అని పేర్కొన్నారు. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో అదనంగా 8, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో మరో రెండు బస్తీ దవాఖానలను ఏర్పాటుచేస్తామని తెలిపారు.కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, తెలంగాణ ఎరుకల సంఘం(కుర్రు) వ్యవస్థాపకుడు కే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.