సంస్థాన్ నారాయణపురం, జూలై 3: సీఎం కేసీఆర్ ను చూస్తేనే ఢిల్లీలోని బీజేపీ అధిష్ఠానం ఉలిక్కిపడుతున్నదని, అందుకే అగ్రనాయకులంతా తెలంగాణ బాట పట్టారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు వారికి విజ్ఞానయాత్రలా మిగిలిపోతాయని ఎద్దేవా చేశారు.
ఆ పార్టీకి చెందిన 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు తెలంగాణ పథకాలను ప్రత్యక్షంగా పరిశీలించి తెలుసుకొని వారి రాష్ట్రాల్లో అమలు చేసే విధంగా పనికొస్తాయని చురకలంటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని చిమిర్యాల, గుడిమల్కాపురం గ్రామాల్లో 61 మందికి ఆదివారం దళితబంధు యూనిట్లను పంపిణీ చేశారు.
అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఆ తర్వాత చౌటుప్పల్లో చౌటుప్పల్, నారాయణపురం మండలాలకు చెందిన పలువురికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎనిమిదేండ్ల మోదీ పాలనలో విధ్వంసాలు తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. బీజేపీలో మార్పు రాకపోతే ప్రజలే మారుస్తారని హెచ్చరించారు. దళితబంధు పథకం విప్లవాత్మకమైందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలాసత్పతి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.