Nizam Sugar Factory | కార్మికులు రోడ్డున పడకుండా.. తెలుగుజాతి ఆత్మగౌరవం ప్రైవేటీకరణ పాలుకాకుండా సీఎం కేసీఆర్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ బిడ్డింగ్లో పాల్గొనేందుకు ముందుకొస్తే.. బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని నిండా ముంచిన కాషాయ నేతలే బీఆర్ఎస్ సర్కారుపై కారుకూతలు కూస్తున్నారు.
ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తే.. 2014లో నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ చైర్మన్గా ఉన్న అప్పటి బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ఫ్యాక్టరీ యూనిట్లకు లేఆఫ్ ప్రకటించారు. ఢిల్లీలోని బీజేపీ పెద్దల అండదండలతో బరితెగించి రాత్రికి రాత్రే యూనిట్లను మూసివేయించారు. తెలంగాణ సర్కారు ప్రయత్నాలకు గండికొట్టారు. ఆనాటి కుట్రపై కనీసం నోరెత్తని రాష్ట్ర కాషాయ పార్టీ నేతలు.. ఫ్యాక్టరీని కాపాడుతామంటున్న బీఆర్ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్పై నోరుపారేసుకుంటున్నారు.
బోధన్, ఏప్రిల్ 17: నిజామాబాద్ జిల్లా బోధన్లో 1937లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ కాలంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ (ఎన్ఎస్ఎఫ్) ఏర్పాటైంది. దీన్ని ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ పర్యవేక్షణలో 15వేల ఎకరాల్లో ఏర్పాటు చేశారు. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా ప్రసిద్ధిగాంచింది. లాభాల్లో పయనిసున్న నిజాం షుగర్స్పై సీమాంధ్ర పాలకుల పుణ్యమా అని నీలినీడలు కమ్ముకున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోని హిందూపూర్, మిర్యాలగూడ, లచ్చాయిపేట్లో ఉన్న నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ యూనిట్లను నాటి పాలకులు అయినకాడికి అమ్మేశారు. అంతటితో ఆగకుండా 2002 వరకు కూడా లాభాలు ఆర్జిస్తున్న శక్కర్నగర్, మెట్పల్లి, మెదక్ యూనిట్లను, శక్కర్నగర్లోనే ఉన్న ఆల్కహాల్ డిస్టిలరీని కూడా నాటి సీఎం చంద్రబాబు అమ్మకానికి పెట్టారు.
లాభాలబాటలో పయనిస్తున్న ఫ్యాక్టరీ యూనిట్లను ప్రైవేట్పరం చేయడాన్ని చెరుకు రైతులు, కార్మికులు తీవ్రంగా ప్రతిఘటించారు. అప్పుడప్పుడే మొగ్గ తొడిగిన బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ ఈ పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్నది. రైతులు, కార్మికుల ఆందోళనను లెక్కచేయకుండా చంద్రబాబు నిజాం షుగర్స్ను జాయింట్ వెంచర్ పేరిట గోకరాజు గంగరాజు (ఆంధ్ర)కు చెందిన డెల్టా పేపర్ మిల్స్కు అప్పగించారు. జాయింట్ వెంచర్ కింద ప్రైవేట్ యాజమాన్యానికి 51 శాతం వాటా ఉంటే, ప్రభుత్వానిది కేవలం 49 శాతం వాటా మాత్రమే దక్కింది. నిజాం షుగర్స్ లిమిటెడ్ (ఎన్ఎస్ఎల్), డెల్టా పేపర్ మిల్స్ (డీపీఎం)కు మధ్య జాయింట్ వెంచర్ కుదరటంతో నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) కంపెనీ ఏర్పడింది. ఎన్డీఎస్ఎల్లో మొత్తం ఐదుగురు డైరెక్టర్లు ఉండగా, అందులో ఇద్దరు నిజాం షుగర్స్కు చెందినవారు. మిగతా ముగ్గురు ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్లు. దీంతో ఫ్యాక్టరీపై ప్రైవేట్ యాజమాన్యమే పూర్తిగా పెత్తనం చెలాయించి, ఫ్యాక్టరీ సొమ్మును అందినకాడికి దోచుకొన్నది. ఇలా నాటి టీడీపీ సీఎం చంద్రబాబునాయుడు లాభాలబాటలో ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించి కార్మికులు, కర్షకులకు తీరని అన్యాయం చేశారు.
2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం నిజాం షుగర్స్ ప్రైవేటీకరణపై సభా సంఘాన్ని నియమించింది. శాసనసభలో టీఆర్ఎస్ శాసనసభ్యులు, అప్పటి ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ మంత్రుల ఒత్తిడి ఫలితంగా ఈ సభాసంఘం ఏర్పాటైంది. ఈ సంఘం 2006లో సమర్పించిన తన నివేదికలో నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ అక్రమమని, ఇందుకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, నిజాం షుగర్స్ను స్వాధీనం చేసుకోవాలని సిఫారసు చేసింది. అయితే, కాంగ్రెస్ పాలకులు 2014 వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా, ప్రైవేట్ యాజమాన్యం కొమ్ముకాస్తూ కార్మికులు, కర్షకులకు తీరని అన్యాయం చేసింది. 2002లో ఫ్యాక్టరీని తన అధీనంలోకి తీసుకొన్న ప్రైవేట్ యాజమాన్యం రెండు, మూడేళ్లపాటు లాభాలను చూపించింది. ఆ తర్వాత వరుసగా నష్టాలు చూపిస్తూ ఫ్యాక్టరీని సంక్షోభంలోకి నెట్టింది. ఇలా గత పాలకులు చేసిన పాపాలు ఇప్పటికీ నిజాం షుగర్స్ను వెంటాడుతున్నాయి.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిజాం షుగర్ ఫ్యాక్టరీపై దృష్టి సారించారు. నిజాం షుగర్స్ను స్వాధీనం చేసుకొని, దాన్ని సహకార పద్ధతిలో రైతులకు అప్పగించేందుకు 2015 ఏప్రిల్ 29న జీవోఎంఎస్ 28ను జారీ చేశారు. నిజాం షుగర్స్ను డెల్టా పేపర్ మిల్స్ యాజమాన్యం నుంచి స్వాధీనం చేసుకొనేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. ఈ జీవో అమలుకు ముందుగానే రంగం సిద్ధంచేసింది. ఇందులో భాగంగా మహారాష్ట్రలో చెరుకు సాగు, దిగుబడులు, అక్కడ సహకార రంగంలో చక్కెర ఫ్యాక్టరీల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు బోధన్లోని శక్కర్నగర్ యూనిట్, మెట్పల్లి, మెదక్ యూనిట్ల రైతులను 2015 జనవరిలో సీఎం కేసీఆర్ స్టడీటూర్కు పంపేందుకు నిర్ణయించారు.
400 మంది రైతులను వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి స్టడీటూర్ కోసం మహారాష్ట్రకు తీసుకెళ్లారు. ఈ స్టడీ టూర్తో రైతులు చైతన్యవంతమై బోధన్, మెట్పల్లి, మెదక్ ఫ్యాక్టరీ నిర్వహణలో రైతులు భాగస్వాములవుతారని ప్రభుత్వం ఆశించింది. అయితే, రైతులు తాము చక్కెర ఫ్యాక్టరీలను నడపలేమంటూ నిరాసక్తత వ్యక్తంచేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు కూడా రైతులను చైతన్యం చేసేందుకు ప్రయత్నించకపోగా, వారిని అధైర్యపరిచాయి. మహారాష్ట్రలోలాగా నిజాం చక్కెర కర్మాగారాలను నడిపించేందుకు రైతులు ముందుకు వస్తే ఐదేండ్లపాటు మొత్తం పెట్టుబడి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని సీఎం కేసీఆర్ 2015లో అసెంబ్లీలో ప్రకటించారు. ఫ్యాక్టరీ రీమాడలింగ్ కోసం ఎన్ని వందల కోట్లు అయినా భరిస్తామని వెల్లడించారు. దీనికి ఇప్పటికీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ ఇటీవల నిర్వహించిన ప్రెస్మీట్లో స్పష్టం చేశారు.
2014 డిసెంబర్లో ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ నడిపించలేమంటూ ప్రైవేట్ యాజమాన్యం మొండికేసింది. తెలంగాణ సర్కారు జోక్యం చేసుకొని ప్రైవేట్ యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో యాజమాన్యం ఆ ఏడాది చెరుకు క్రషింగ్ను ప్రారంభించక తప్పలేదు. అయితే, రైతులకు ఇవ్వాల్సిన చెరుకు బిల్లుల బకాయిలను చెల్లించలేమంటూ చేతులెత్తేసింది. దీంతో రూ.11 కోట్ల 26 లక్షల బకాయిలను ప్రభుత్వమే చెల్లించింది. రైతులకు ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి బకాయిలు చెల్లించటం ఆ ఫ్యాక్టరీ చరిత్రలోనే రికార్డు. ఆ తర్వాత ఏడాది కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం చెరుకు బిల్లులు ఇవ్వలేదు. తమకు బ్యాంక్ రుణాలు ఉన్నాయంటూ ఫ్యాక్టరీలోని చక్కెరను అమ్ముకుంటుండగా.. ప్రభుత్వం అడ్డుకొన్నది. చక్కెరను స్వాధీనం చేసుకొని, అమ్మటం ద్వారా వచ్చిన డబ్బును ఒకసారి రూ.27 కోట్లు, మరోసారి రూ.28 కోట్ల చొప్పున రైతులకు చెల్లించింది. ఇలా..మొత్తం 66 కోట్ల రూపాయలను చెరుకు రైతులకు చెల్లించి, వారిని ఆదుకొన్నది. 2015-16 సీజన్కు నిజాం షుగర్స్లో ప్రైవేట్ యాజమాన్యం చెరుకు క్రషింగ్ చేయలేదు. దీంతో ప్రభుత్వమే చెరుకును ఇతర ఫ్యాక్టరీలకు రవాణా చేసింది. ఆ రవాణా చార్జీలను కూడా ప్రభుత్వమే భరించింది. తెలంగాణ ఏర్పడ్డనాటినుంచీ సీఎం కేసీఆర్ పెద్ద మనసు చూపి చెరుకు రైతులను ఆదుకొంటూ వస్తున్నారు.
నిజాం షుగర్స్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకొనే ప్రక్రియ పూర్తయ్యేవరకు కూడా ప్రైవేట్ యాజమాన్యం నిర్వహించలేకపోయింది. దొరికిన కాడికి దోచుకున్న యాజమాన్యం ఫ్యాక్టరీని నడపలేమంటూ చేతులెత్తేసింది. బోధన్లో నిజాం షుగర్స్ శక్కర్నగర్ యూనిట్తోపాటు డిస్టిలరీ, మెట్పల్లి, మెదక్ యూనిట్లకు కూడా 2015 డిసెంబర్ 22న అర్ధరాత్రి లేఆఫ్ ప్రకటించింది. ఈ చర్య నిజాం షుగర్స్ స్వాధీనానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు పెద్ద అడ్డంకిగా మారింది. గణనీయంగా తగ్గిపోయిన చెరుకు సాగు మరో పెద్ద అడ్డంకిగా మారింది. ఒకవేళ ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరిగినా.. రైతులు చెరుకు సాగుచేస్తారనే నమ్మకం లేకుండాపోయింది. నిజాం షుగర్స్ మూడు యూనిట్లు పూర్తి సామర్థ్యం మేరకు నడవాలంటే పది లక్షల టన్నుల చెరుకు అవసరం ఉంటుంది. ఇంతమొత్తంలో చెరుకు అందకపోతే ఫ్యాక్టరీని ప్రారంభించినా నష్టాల చరిత్ర పునరావృతమయ్యే ప్రమాదం ఉంది.
నిజాం షుగర్స్ను సీమాంధ్ర పాలకులు నాశనం చేశారు. టీడీపీ ప్రభుత్వం ప్రైవేటోడికి అమ్మేసింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఈ ఫ్యాక్టరీని పట్టించుకోకుండా ప్రైవేటోడికే కొమ్ముకాసిన్రు. తెలంగాణ అచ్చినంక సీఎం కేసీఆర్ నిజాం షుగర్స్కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేసిన్రు. ఫ్యాక్టరీని ప్రభుత్వరంగంలోకి తీసుకువస్తారన్న భయంతో ఈసారి బీజేపీతో కలిసి ఎన్డీఎస్ఎల్ చైర్మన్ గోకరాజు గంగరాజు కుట్ర చేసిండు. దొంగ కారణాలు చూపి రాత్రికి రాత్రే లేఆఫ్ ప్రకటించిండు. ట్రిబ్యునల్స్లో పిటిషన్లు ఏసిండు. అయినా కేసీఆర్ సారు చెరుకు రైతులకు బకాయిలు చెల్లించి ఆదుకున్నడు. నిజాం షుగర్స్ భూముల రక్షణకు రాష్ట్ర సర్కారు ఇప్పటికీ న్యాయపోరాటం చేస్తుండటం హర్షణీయం.. సీఎం కేసీఆర్పై కార్మికులు, రైతులకు మస్తు నమ్మకం ఉంది.
– రవిశంకర్గౌడ్, నిజాం షుగర్స్ కార్మిక నాయకుడు, బోధన్
నిజాం దక్కన్ షుగర్స్ యాజమాన్యం తమ వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల్లో అప్పులు ఉన్నాయని, వీటిని పరిష్కరించాలని 2016లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో ఇన్సాల్వెన్సీ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్సీఎల్టీ ప్రైవేట్ యాజమాన్యానికి అనుగుణంగా తీర్పు ఇవ్వగానే, రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. నిజాం షుగర్స్ భూములు, ఆస్తులను రక్షించాలన్న తపనతో ఢిల్లీలోని ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్)ను రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది. నిజాం షుగర్స్ లాభాలను ప్రైవేట్ యాజమాన్యం అనుభవించిందని, తెలంగాణాలోని విలువైన ఫ్యాక్టరీ భూములను తాను చేసిన అప్పుల కింద అమ్మేందుకు కుట్ర చేస్తోందని అప్పిలేట్ ట్రిబ్యునల్లో రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. దీంతో నిజాం షుగర్స్ లిక్విడేషన్ను నిలిపివేస్తూ అప్పిలేట్ ట్రిబ్యునల్ 2019లో తీర్పు ఇచ్చింది. ప్రైవేట్ యాజమాన్యం దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీంకోర్టు విచారణలో ఉన్నది. నిజాం షుగర్స్ పునరుద్ధరణ ప్రక్రియకు సాంకేతిక అడ్డంకిగా మారింది.