హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఫలితాల్లో కాంగ్రెస్ కోల్పోయిన ఓట్లు.. బీజేపీ దక్కించుకున్న ఓట్లు దాదాపు ఒకటే. 2018 ఎన్నికలతో పోల్చితే కాంగ్రెస్ 73,334 ఓట్లను కోల్పోగా, బీజేపీ అంతేస్థాయిలో 73,791 ఓట్లను అదనంగా దక్కించుకున్నది. అంటే బీజేపీకొచ్చినవి కాంగ్రెస్ ఓట్లేనని.. బీజేపీ బలం పెరిగిందేమీలేదని స్పష్టమవుతున్నది.
2018లో కాంగ్రెస్కు 97,239 ఓట్లు రాగా, తాజా ఫలితాల్లో 23,905 ఓట్లు వచ్చాయి. అంటే కాంగ్రెస్ 73 వేల ఓట్లను కోల్పోయింది. ఇక 2018 ఎన్నికల్లో బీజేపీ 12,725 ఓట్లు పొందగా, తాజా ఎన్నికల్లో 86,696 ఓట్లను తెచ్చుకుంది. అంటే 73,791 ఓట్లను ఆ పార్టీ అదనంగా దక్కించుకుంది. దీనిని బట్టి అభ్యర్థితోపాటు కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయే తప్ప అక్కడ బీజేపీ బలం నామమాత్రమేనని తేలిపోయింది.