యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాల నుంచి కనీస మద్దతు కూడా లభించడంలేదు. మునుగోడులో గెలుస్తామని ఎట్లాగూ నమ్మకం లేదు. కానీ మూడో స్థానానికి పడిపోవచ్చని సర్వేలు చెప్తుండటంతో రాజగోపాల్రెడ్డిని సింపుల్గా వదిలేసినట్టు కనిపిస్తున్నది. దీంతో రాజగోపాల్రెడ్డి నైరాశ్యంలో పడ్డారని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి ఎక్కడున్నారో ఎవరికీ తెలియని పరిస్థితి. కాంగ్రెస్ శ్రేణులన్నీ తన వెంటే వస్తాయని ఊహించిన రాజగోపాల్రెడ్డికి 20 శాతం కూడా వెంట రాకపోవడంతో ప్రచారంలో ముందుకు వెళ్లడంలో తడబడుతున్నారు. ఉప ఎన్నిక ప్రచా రం విషయంలో రాజగోపాల్రెడ్డి సొంతంగా నిర్ణయాలు తీసుకోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్షా మందలించినట్టు తెలిసింది. ఇప్పటికే గులాబీ దండు ప్రచారంలో దూసుకుపోతుండటం, ప్రజల సంపూర్ణ మద్దతు లభిస్తుండటంతో కారు పార్టీ విజయం నల్లేరు మీద నడకే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ శ్రేణులు కలిసి రాలే..
సొంత ప్రయోజనాల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగోపాల్రెడ్డి.. కాం గ్రెస్ శ్రేణులు మొత్తం తన వైపే వస్తాయని బీరా లు పలికారు. డబ్బులు కుమ్మరించే ప్రయత్నం చేశారు. కానీ, క్షేత్రస్థాయిలో సీన్ తారుమారైంది. కనీసం 20 శాతం క్యాడర్ కూడా బీజేపీలో చేరలేదు. కాంగ్రెస్లో ఉండి అష్టకష్టాలు పడి, సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలిపించామని, ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని కాంగ్రెస్ క్యాడర్ రాజగోపాల్పై గుర్రుగా ఉన్నది. రాజగోపాల్రెడ్డి వెంట నడవడం పక్కన బెడితే.. ఆయనను ఓడించడమే తమ ప్రథమ లక్ష్యమని హస్తం పార్టీ నేతలు బహిరంగంగానే చెప్తున్నారు.
కేంద్ర పార్టీ కూడా అంతే..
చిన్న విషయాన్ని రచ్చరచ్చ చేసే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటి దాకా మునుగోడులో కాలు మోపలేదు. ప్రజా సంగ్రామ యాత్ర లేకున్నా నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడటంలేదు. రాజీనామా చేసిన మొదట్లో మునుగోడులో జరిగిన అమిత్ షా సభకు వచ్చిపోయారు. తర్వాత మళ్లీ పత్తాలేరు. కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదు. ఎన్నికలు అనగానే కుప్పలు తెప్పలుగా పడిపోయే బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు ఊసుకైనా కనిపిస్తలేరు. రాష్ర్టానికి చెందిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి సైతం పట్టించుకోవడంలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం జాతీయ, కేంద్ర మంత్రులు జోరుగా ప్రచారం చేశారని, రాజగోపాల్రెడ్డి తీరు నచ్చక ఎవరూ రావడంలేదని ఆ పార్టీ నేతలు అనుకొంటున్నారు.
బీజేపీ ఇన్చార్జి మనోహర్రెడ్డి ఎక్కడ?
బీజేపీ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి జీ మనోహర్రెడ్డి నియోజకవర్గంలో ఇప్పటిదాకా కనిపించలేదు. ఆయన ఇక్కడి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. అయినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు. నిన్నగాక మొన్న పార్టీలో చేరిన రాజగోపాల్రెడ్డిని దగ్గరికి తీయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్నమొన్నటివరకు బండి సంజయ్ యాత్రకు ప్రముఖ్గా ఉన్నారు. ఇప్పుడు ఎలాంటి యాత్రలు లేకపోయినప్పటికీ.. మునుగోడు ముఖం చూడటం లేదు. బయటకు ఏమీ మాట్లాడకపోయినా.. లోపల కుమిలిపోతున్నారని బీజేపీ పాత క్యాడర్ అంటున్నది. తనకు వెన్నుపోటు పొడిచారని మదనపడుతున్నారని చెప్తున్నది. గత ఎన్నికల్లో పోటీ చేసిన మనోహర్రెడ్డి 12 వేల ఓట్లు వచ్చాయి. మొత్తం ఓట్లలో 6 శాతం ఓట్లు కూడా తెచ్చుకోలేని బీజేపీ.. 60 శాతం పైగా ఓట్బ్యాంక్ ఉన్న పార్టీతో తలపడుతున్నది. అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 6, బీజేపీ సభ్యుల సంఖ్య మూడు. రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లి ఏం సాధిస్తారని మునుగోడులో చర్చ జరుగుతున్నది. పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో ఎవరూ పట్టించుకోకపోతే ఘోర ఓటమి తప్పదని పార్టీ కార్యకర్తలే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు బీజేపీ పాత,కొత్త నాయకుల పంచాయితీ రోజురోజుకూ ముదురుతున్నది. పాత లీడర్లను అసలే పట్టించుకోకపోవడంతో తామెందుకు గొంతు చించుకోవాలని సైలెంట్ అయిపోతున్నారు. మరోవైపు గులాబీ దళం ప్రచారంలో దూసుకెళ్తున్నది. మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రజలు సైతం కారు వెంటే నడుస్తున్నారు.
చేతులెత్తేసిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం
మునుగోడులో గెలుపు సంగతి బీజేపీ నేతలు ఇప్పటికే మరిచిపోయారు. మూడో స్థానానికి పరిమితం కావడం తథ్యమని తేలిపోవడంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉప ఎన్నికలను లైట్ తీసుకొన్నట్టు తెలుస్తున్నది. పార్టీ అభ్యర్థిని పెద్దగా పట్టించుకోవడం లేదని నియోజకవర్గం వ్యాప్తంగా ప్రచారం జరుగుతున్నది. నోటిఫికేషన్ విడుదలై నామినేషన్లు దాఖలవుతున్నా ఆ పార్టీ రాష్ట్ర నేతలు ఇటువైపు చూడటంలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఒంటెత్తు పోకడలు, అడ్డగోలు నిర్ణయాలతో నాయకత్వం కోపంగా ఉన్నది. బీజేపీ స్టీరింగ్ కమిటీ సభ్యుల ఎంపికలోనూ మాజీ ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరించారని, ఫలానా వ్యక్తులే కమిటీలో ఉండాలని పట్టుబట్టారని సమాచారం. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి స్టీరింగ్ కమిటీ బాధ్యతలు కావాలని భీష్మించి కూర్చోవడంతో రా్రష్ట్ర పార్టీ తలలు పట్టుకొన్నది. పాత నేతలకు ప్రాధాన్యం ఇవ్వకుండా రాజగోపాల్రెడ్డి తన ఇష్టమున్నట్టు చేసుకుంటుంటే తామెందుకని అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరు నేతలు మినహా మునుగోడులో కమలం నాయకులు పెద్దగా కనిపించడంలేదు.