కాశీబుగ్గ, జూన్ 30 : గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేసి గెలిచామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి బహిరంగ ప్రకటన చేశారని, వెంటనే సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసి మంత్రి కొండా సురేఖను ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు, వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా రూ.70 కోట్లు ఖర్చు చేసి తన సతీమణి కొండా సురేఖను గెలిపించుకున్నట్టు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన బహిరంగ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని వెంటనే ఎన్నికల కమిష న్ సురేఖ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆదివారం వరంగల్లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో కొండా మురళి మాట్లాడుతూ.. తన భార్య సురేఖ గెలుపు కోసం 16 ఎకరాల భూమి అమ్మి రూ.70 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. 2023 అఫిడవిట్లో తన పేరు మీద ఎకరం, తన భర్త కొండా మురళి పేరిట 13.31 ఎకరాలు ఉన్నట్టు పొందుపరిచినట్టు తెలిపారు. తనకు ప్రస్తుతం 500 ఎకరాల భూమి ఉన్నదని, 16 ఎకరాలు అమ్మిన ట్టు ఇటీవల కొండా మురళి పేర్కొన్నారు. కొండా మురళి వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలతో కూడిన సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సమర్పిస్తానని చెప్పారు. ఎన్నికల అధికారులు విచారణ చేపట్టి సురేఖ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరనున్నట్టు తెలిపారు. వరంగల్ తూర్పు నుంచి అడ్డదారిలో గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో చోటుదక్కించుకున్న కొండా సురేఖ నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని ఎర్రబెల్లి ప్రదీప్రావు డిమాండ్ చేశారు.