పాలకుర్తి (జనగామ), సెప్టెంబర్ 16 : మహాత్మ గాంధీజీని చంపిన గాడ్సే వారసులెవరో బీజేపీ ప్రజలకు చెప్పాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్స ర్యాలీ, బహిరంగ సభలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అసలు స్వాతంత్య్ర ఉద్యమంతో బీజేపీకి ఏదైనా పాత్ర ఉందా? పోనీ బీజేపీలో ఉన్న వాళ్లెవరికైనా స్వాతంత్య్ర సమరయోధుల వారసత్వం ఉందా? తెలంగాణ సాయుధ పోరాటానికి బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా? అంటూ బీజేపీని నిలదీశారు.
లేనిపోని ఏజెండాలతో జాతీయ జెండాను ఎగురవేసే కార్యక్రమాలను పనిగట్టుకుని తెలంగాణపై ఆ పార్టీ దండయాత్ర చేస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రానికి రావచ్చు.. పోవచ్చు.
దాన్ని ఎవరూ తప్ప పట్టరని, కానీ బీజేపీనేతలు టూరిస్టుల్లా అదే పనిగా మన రాష్ట్రానికి వస్తూ, మన మధ్య మత తత్వ చిచ్చు పెట్టి, విద్వేషాలను రెచ్చగొట్టి లేని పోని సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా ఉందని మంత్రి తెలిపారు. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న తెలంగాణు అడ్డుకోవడానికి బీజేపీ కుట్ర పన్నుతుందని మంత్రి తెలిపారు. ఇలాంటి మత తత్వ పార్టీల నుంచి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకొని బీజేపీకి బుద్ధి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు.