హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): ఎన్ని పాపాలు చేసైనా సరే అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటున్నదని, తెలంగాణ గడ్డ మీద ఆ పార్టీ కల శాశ్వత కలగానే మిగిలిపోతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తేల్చిచెప్పారు. ‘బ్రోకర్-జుమ్లా-పేపర్లీక్ పార్టీ’గా బీజేపీ మారిందని విమర్శించారు. పేపర్ లీకేజీకి కుట్ర పన్ని లక్షలాదిమంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేసిన దుర్మార్గుడు బండి సంజయ్ అని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా బండి మారాడని ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు.
బీజేపీ తన పాపాలను ప్రక్షాళన చేసుకోవాలని.. ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే బండి సంజయ్ని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్రావు బీజేపీ ధోరణిని తూర్పారబట్టారు. పదో తరగతి పేపర్ లీక్ చేసి అడ్డంగా దొరికిపోయిన దొంగ బండి సంజయ్ అని దుయ్యబట్టారు. బెయిల్కు, తుది తీర్పునకు తేడా తెలియని అజ్ఞాని అని చెప్పారు. టెన్త్ పేపర్ లీకేజీ వంటి దుర్మార్గమైన, నీచమైన చర్యతో లక్షల విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులపాలు చేసిన బండి బెయిల్పై జైలు నుంచి బయటకు వస్తే విజయోత్సవాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. దొంగలు, హంతకులకు కూడా పరిస్థితులనుబట్టి, ఆరోగ్యస్థితిని బట్టి న్యాయస్థానాలు బెయిల్ ఇస్తాయని.. అంతమాత్రాన అది తుది తీర్పు కాదని బీజేపీ నాయకులు గ్రహించాలని సూచించారు. బండి సంజయ్ ఏ తప్పూ చేయకపోతే పోలీసులకు ఫోన్ ఎందుకు ఇవ్వట్లేదని ఎర్రబెల్లి ప్రశ్నించారు. బండి సంజయ్ చేసిన తప్పును ఇప్పటికైనా బీజేపీ ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
వాజపేయి, అద్వానీల నాటి విలువలను బీజేపీ విడిచిపెట్టిందని విమర్శించారు. ధర్మంగా, న్యాయంగా ఉండేవారి వైపే దేవుడు ఉంటాడని బీజేపీ తెలుసుకోవాలని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో, మునుగోడు ఉపఎన్నికల సమయంలో యాదాద్రి లక్ష్మినర్సింహస్వామి గుడిలో తడిబట్టలతో ప్రమాణం చేస్తే ఏమైందని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్ లోక్సభ సభ్యత్వాన్ని తక్షణమే రద్దుచేయాలని మంత్రి దయాకర్రావు డిమాండ్ చేశారు.
తప్పు చేసి.. వెకిలిగా మాట్లాడుతున్న బండి : బాల్క సుమన్
తప్పు చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిపోయి బండి సంజయ్ వెకిలిగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. బెయిల్ నంచి బయటికి వచ్చిన తర్వాత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణ చరిత్రలో బండి సంజయ్ లీకువీరుడిగా మిగిలిపోతారని చెప్పారు. బండితప్పును సమర్థించడమే కాక ఇలాగే చేయాలన్నట్టు ఆ పార్ట్టీ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్చుగ్ ప్రోత్సహించడం అత్యం త జుగుప్సాకరమని అన్నారు.
సింగరేణిపై మాట తప్పిన మోదీ
సింగరేణిని ప్రయివేటీకరించబోమని రామగుండం బహిరంగ సభ సాక్షిగా వాగ్దానం చేసిన ప్రధాని మోదీ మాట తప్పారని బాల్క సుమన్ మండిపడ్డారు. మోదీ తన దోస్తు అదానీకి అప్పగించే కుట్రలో భాగంగానే 4 బ్లాకుల వేలం ప్రకటన చేశారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేసినట్టే సింగరేణిని చేద్దామంటే కుదరదని తేల్చిచెప్పారు. సిం గరేణితో తెలంగాణతో పేగుబంధం ఉందని, ప్రైవేటీకరణ కుట్రను అడ్డుకుంటామని స్పష్టంచేశారు. సింగరేణికి కోల్ బ్లాక్లు అప్పగించాలని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీని కలిసి విన్నవించారని, అలాగే మంత్రి కేటీఆర్, సింగరేణి సంస్థ సంబంధిత శాఖల మంత్రులకు అనేకసార్లు రాసిన లేఖలను ఆయన ఈ సందర్భంగా ప్రదర్శించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి సహా నలుగురు బీజేపీ ఎంపీలను కోల్బెల్ట్ ఏరియాలో తిరగనీయబోమని చెప్పారు. శనివారం మంచిర్యాల, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం కేంద్రాల్లో కేటీఆర్ పిలుపుమేరకు మహాధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు.
బండిపై క్రమశిక్షణా చర్యలేవి: ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న బండి సంజయ్పై క్రమశిక్షణ చర్యలను బీజేపీ ఎందుకు తీసుకోవడం లేదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రశ్నించారు. లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తిని, పోలీస్స్టేషన్లో కేసు నమోదై, జైలుకు వెళ్లిన నాయకుడిపై పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. దీన్నిబట్టి ఢిల్లీ పెద్దల కనుసన్నల్లోనే రాష్ర్టాన్ని అస్థిరం చేసే కుట్రకు బీజేపీ పాల్పడుతున్నట్టు స్పష్టమవుతున్నదని చెప్పారు. ఏ తప్పూ చేయకపోతే పోలీసులకు బండి తన సెల్ఫోన్ను ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. ఎంపీగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన బండి.. దాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో తక్షణమే లోక్సభ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేయాలని కోరారు.
కిరణ్కుమార్ రెడ్డి చేరికతో స్పష్టం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డి చేరికతో బీజేపీ తెలంగాణ వ్యతిరేకి అని మరోసారి స్పష్టమైందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ, ప్రజాస్వామ్యయుతంగా కాకుండా పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించారంటూ తన అక్కసును పలుమార్లు వెళ్లగక్కిన మోదీ రాష్ట్ర ఏర్పాటును అంగీకరించని కిరణ్కుమార్రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం చూస్తే.. తెలంగాణకు బీజేపీ వ్యతిరేకి అని తేలిపోయిందని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవంతో తనను తాను నిరూపించుకుంటుందని, అంతేగానీ గుజరాత్ గులాములకు, అమిత్షాలకు చెప్పులు మోసి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేవాళ్ల భరతం పడుతుందన్నారు.
దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం
ప్రజాక్షేత్రంలో నిలువలేక, నిలబడే ధైర్యం లేక బండి సంజయ్ అవాకులు చెవాకులు పేలుతున్నారని విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. మంత్రి కేటీఆర్పై బండి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. త్వరలో కేటీఆర్కు ఈడీ, సీబీఐ, ఐటీ నోటీసులు రాబోతున్నాయని బండి సంజయ్ ఎట్లా చెప్తారని బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో ఎమ్మెల్సీ కవిత విషయంలోనూ బండి ఇలానే వ్యాఖ్యానించారని, ఆ తర్వాతే కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగిన ఉదంతాన్ని ఆయన గుర్తుచేశారు. రాజ్యాంగబద్ధ సంస్థలు నిష్పాక్షికంగా పనిచేస్తున్నాయా? లేక బీజేపీ చెప్పుచేతల్లో నడుస్తున్నాయా? అన్నది దేశ ప్రజలకు తెలిసిపోయిందన్నారు.