స్పెషల్ టాస్క్ బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గెలుపు కష్టమేనా? దాదాపు 160 లోక్సభ స్థానాలు ఆ పార్టీ కోల్పోవాల్సిందేనా? అంటే అవునని ఆ పార్టీ నిర్వహించిన సర్వేలు, అంచనాల్లో తేలినట్టు సమాచారం. హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 140 లోక్సభ స్థానాలు తమకు క్లిష్టంగా ఉంటాయని బీజేపీ అంచనా వేసింది. తాజా సర్వేలు, అంచనాల ప్రకారం ఆ సంఖ్య 160కి చేరినట్టు పార్టీ వర్గాలు చర్చించుకొంటున్నట్టు జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. రెండు అంచనాల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొనే స్థానాల సంఖ్య ఒక్కసారిగా 20 పెరగటంతో ఆ పార్టీ ఆందోళన చెందుతున్నది.
గెలవడం అంత ఈజీ కాదు
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడం కష్టమేనని, 160 లోక్సభ స్థానాల్లో సాధించే ఫలితాలపై పరిస్థితి ఆధారపడి ఉంటుందని బీజేపీ విశ్లేషించుకొంటున్నది. బీజేపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన సొంత రాష్ట్రం హిమాచల్ప్రదేశ్లోనే పార్టీని గెలిపించుకోలేకపోయారు. ఈ పరిణామంతో నడ్డాను పార్టీ బాధ్యతల నుంచి తప్పించి మరొకరికి బాధ్యతలు అప్పగిస్తారని భావించారు. అయితే వచ్చే ఏడాది 9 రాష్ర్టాలలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సంస్థాగత ఎన్నికలను సార్వత్రిక ఎన్నికల వరకు వాయిదా వేయాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్టు ఓ జాతీయ మీడియా పేర్కొన్నది. సారత్రిక ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పార్టీ అధ్యక్షుడిని మార్చితే మరిన్ని ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ విశ్లేషించుకొంటున్నదని వెల్లడించింది.
ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడం ఎలా?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, దీన్ని అధిగమించి తిరిగి అధికారంలోకి రావడం అంత సులువేమీ కాదని ఆ పార్టీ అంచనా వేస్తున్నది. హిమాచల్ప్రదేశ్లో ఓటమి, బీహార్లో మిత్రపక్షం జేడీయూ దూరం కావడం, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో పార్టీ అంతర్గత కుమ్ములాటలు, రాష్ట్ర నేతల మధ్య విభేదాలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర, సంపన్నులకు అనుకూల పార్టీగా సామాన్య ప్రజల్లో బలంగా నాటుకున్న అభిప్రాయాలపై బీజేపీ అధినాయకత్వం ఆందోళనకు గురి అవుతున్నది.
వచ్చే ఏడాది 9, సార్వత్రికతో పాటు 4 రాష్ర్టాలకు ఎన్నికలు
లోక్సభ పదవీకాలం జూన్ 2024తో తీరిపోనున్నది. ఆ లోగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నది. అంతకుముందు 2023లో 9 రాష్ర్టాల అసెంబ్లీలకు పదవీ కాలం తీరిపోనున్నది. అలాగే 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలతో పాటు మరో 4 రాష్ర్టాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉన్నది. ఈ ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్షగా నిలవనున్నాయి.
బీఆర్ఎస్తో పెనుసవాళ్లు
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ప్రాంతీయ పార్టీల నేతలను బీజేపీకి వ్యతిరేకంగా ఏకతాటిపైకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలు, ‘బీజేపీ ముక్త్ భారత్’, ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదాలు దేశవ్యాప్తంగా రోజురోజుకు బలపడుతుండటం బీజేపీ అధినాయకత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. దీనికి తోడు తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ ప్రతిష్ఠ దేశవ్యాప్తంగా మసకబారడంతో దీన్నుంచి బయటపడేందుకు ఆ పార్టీ ఆపసోపాలు పడుతున్నది. బీఆర్ఎస్ను రాజకీయ ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే, ఎమ్మెల్యేల కొనుగోలులో న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడటం బీజేపీ అగ్ర నాయకత్వానికి పెనుసవాల్గా మారింది.
160 లోక్సభ సీట్లపై రోడ్ మ్యాప్
గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న 160 స్థానాల్లో పార్టీని గెలిపించుకొనేందుకు తగిన రూట్ మ్యాప్ రూపొందించుకోవాలని ఈ నెల 5న ఢిల్లీలో ప్రధాని మోదీ బీజేపీ జాతీయ కార్యవర్గానికి దిశానిర్దేశం చేసారు. దీనిపై ఈ నెల 19న ఢిల్లీలో, 21, 22 తేదీల్లో బీహార్లో పార్టీ సంస్థాగత కార్యదర్శులు వినోద్ తవుడే, సునీల్ బన్సాల్తో జాతీయ అధ్యక్షుడు నడ్డా చర్చించారు. ఇక్కడ 90 లోక్సభ స్థానాల రోడ్ మ్యాప్పై చర్చించగా, ఈ నెల 28, 29న హైదరాబాద్లో జరిగే సమావేశంలో 70 లోక్సభ స్థానాలపై రోడ్ మ్యాప్ తయారు చేయనున్నట్టు తెలిసింది. ఈ సమావేశానికి పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హాజరుకానున్నారని సమాచారం.