హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రథయాత్ర కార్యక్రమానికి ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతలకు సూచించారు. గురువారం ఆయన హైదరాబాద్లో పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడారు. శుక్రవారం నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి.
ఈ సమావేశాలకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కనీసం 200 మంది ముఖ్య నేత లు తరలివెళ్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వీరంతా 18 వరకు అక్కడే ఉండనున్నారు. వచ్చిన తర్వాత రథయాత్ర ఏర్పాట్లకు 19వ తేదీ ఒక్కరోజే సమయం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు చేసుకోవాలని కిషన్రెడ్డి నేతలకు సూచించారు. రూట్మ్యాప్లు, ఆయా మార్గాల్లో వసతులపై దృష్టి సారించాలని తెలిపారు. జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో శుక్రవారం బీజేపీ రాష్ట్ర ఆఫీసులో ఆఫీస్ బేరర్స్ సమావేశం కానున్నారు.