Godavari-Cauvery Link | హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు తలపెట్టిన గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు తెలంగాణ పాలిట మరో పోతిరెడ్డిపాడులా మారుతుందా? శ్రీశైలం నుంచి చెన్నైకి తాగునీటి సరఫరా పేరిట కృష్ణా జలాలను యథేచ్ఛగా దోపిడీ చేస్తున్న ఏపీ.. ఇకపై గోదావరి జలాలను కూడా అదేవిధంగా మళ్లిస్తుందా? నదుల అనుసంధానం ప్రాజెక్టు నిర్దేశిత లక్ష్యం నెరవేరడం కష్టమేనా? అలాంటి ప్రమాదమే ఉన్నదని హెచ్చరిస్తున్నారు తెలంగాణ ఇంజినీర్లు. నదుల అనుసంధానం ప్రాజెక్టుతో తెలంగాణకు ఒరిగేదేమీ లేకపోగా, గోదావరి జలాలపై హక్కులను సైతం కోల్పోవాల్సిన దుస్థితి దాపురిస్తుందనేది వారి ఆందోళన, ఆవేదన. ఇంజినీర్లు వ్యక్తంచేస్తున్న అభిప్రాయాలకు గత అనుభవాలే కాదు, ప్రస్తుతం కృష్ణా జలాలను ఏపీ తరలించుకుపోతున్న తీరు కూడా బలాన్నిస్తున్నది. సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా రాజకీ య ప్రయోజనాల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నదులఅనుసంధానంపై మొండిగా ముందుకెళ్తున్నదని ఇంజినీర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
చెన్నైవాసుల దాహార్తిని తీర్చేందుకు మానవతా దృక్పథంతో కృష్ణా బేసిన్లోని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ర్టాలు 5 టీఎంసీల చొప్పున మొత్తంగా 15 టీఎంసీల నీటిని అందివ్వాలని ఒప్పందం కుదిరింది. ఆ నీటి సరఫరా బాధ్యతను కృష్ణా బేసిన్లో దిగువన ఉన్న ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి కట్టబెట్టారు. మిగులు జలాల నుంచి ఏటా ఒప్పందం మేరకు నీటిని చెన్నైకి ఇవ్వాల్సి ఉన్నది. అంతవరకు బాగానే ఉన్నా, ఆచరణలో మాత్రం పెద్దన్నపాత్ర ముసుగులో చెన్నైకి తీరని ద్రోహం చేస్తూ.. కృష్ణా జలాల దోపిడీకి తెరలేపారు ఉమ్మడి పాలకులు! తొలుత ఎస్ఆర్బీసీ (శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్)ని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకొచ్చారు. ఆ తరువాత మొత్తంగా 34 టీఎంసీలను అది కూడా 880 అడుగులు ఉన్నప్పుడు వరద జలాలను తరలించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటుచేశారు. అక్కడితో ఊరుకోలేదు. అంతకు నాలుగింతల జలాలను ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్, నిప్పులవాగు, ఎస్కేప్ చానల్ ద్వారా అక్రమంగా పెన్నా బేసిన్కు ఏపీ తరలించుకుపోతున్నది. 880 అడుగుల నుంచే కాదు ఏకంగా 800 అడుగుల నుంచీ నీళ్లను తీసుకుపోయేలా ప్రాజెక్టులను చేపట్టారు.వాస్తవంగా 1,500 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించాల్సిన కాలువను తొలుత 11 వేల క్యూసెక్కులకు, ఆ తరువాత 44 వేల క్యూసెక్కులకు, ఇటీవల రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా దాని సామర్థ్యాన్ని 88 వేల క్యూసెక్కులకు విస్తరించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే పోతిరెడ్డిపాడు, దాని అనుబంధ ఔట్లెట్ల ద్వారా తరలించే జలాలను నిల్వ చేసుకునేందుకు 350 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లను నిర్మించారంటే ఏపీ జలదోపిడీని ఊహించుకోవచ్చు.
ఏపీ జలదోపిడీ సంగతి అలా ఉంటే, చెన్నైకి తాగునీటిని అందించాలన్న నిర్దేశిత ఒప్పందం ఆచరణలో అమలు కాలేదు. అంతర్రాష్ట్ర ఒప్పందాన్ని ఏపీ ప్రభుత్వం దశాబ్దాలుగా కాలరాస్తూ మదరాసీల గొంతును ఎండబెడుతున్నది. ఒప్పందం ప్రకారం కేటాయించిన 15 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ నుంచి తెలుగుగంగ కాలువ ద్వారా తొలుత సోమశిల రిజర్వాయర్కు, అక్కడి నుంచి కండలేరు రిజర్వాయర్కు, ఆపై తమిళనాడులోని పూండి రిజర్వాయర్కు తరలించాలి. శ్రీశైలం నుంచి పూండి వరకు 406 కిలోమీటర్లు దూరం ఉంటుంది. కండలేరు-పూండి రిజర్వాయర్ మధ్య దూరం 160-170 కిలోమీటర్లు ఉంటుంది. అయినా, ఒప్పందం మేరకు నీళ్లు ఇవ్వకుండా చెన్నై నగరవాసులను దశాబ్దాలుగా అరిగోస పెడుతున్నది. ఏటా సగటున 100 టీఎంసీలకు మించి కృష్ణాజలాలను పోతిరెడ్డిపాడు ద్వారా మళ్లించుకుంటున్న ఏపీ.. రెండు దశాబ్దాల కాలంలో చెన్నైకి ఏనాడూ 10 టీఎంసీలకు మించిఇచ్చిన పాపానపోలేదు. అందుకు ప్రధాన కారణం దారిపొడవునా ఏపీ కొనసాగించిన జల దోపిడీనే. కాలువల ద్వారా ఆవిరి నష్టాలకు తోడు, ఏపీ రైతులు మోటర్ల ద్వారా నీటిని తోడేయడం వల్ల చెన్నైకి గరిష్ఠంగా ఎనిమిది టీఎంసీలకు మించి చేరడంలేదు. ఈ విషయాన్ని 2005లోనే అప్పటి తమిళనాడు మంత్రి, ప్రస్తుత ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ అప్పటి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డిని నేరుగా కలిసి విన్నవించుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఏపీతో వేగలేక బేసిన్లోని కర్ణాటక, మహారాష్ట్రతోపాటు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కు, కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖకు తమిళనాడు సర్కార్ లెక్కలేనన్ని లేఖలు రాసింది. అయినా తమిళనాడుది అరణ్యరోదనగానే మిగిలిపోయింది. కండలేరు, సోమశిల జలాశయాల్లో నీటి నిల్వలు భారీగా ఉన్నప్పటికీ, కనీసం రెండు టీఎంసీలను కూడా ఏపీ ఇవ్వడం లేదని ఫిర్యాదులు చేసింది. ఏపీ తీరుతో విసిగిపోయిన తమిళనాడు సర్కారు ఒకానొక దశలో చెన్నై తాగునీటి కోసం కండలేరు రిజర్వాయర్ నుంచి పూండి రిజర్వాయర్ వరకు దాదాపు 160-170 కిలోమీటర్ల మేర పైప్లైన్ నిర్మాణానికి నాలుగైదు వేల కోట్ల రూపాయలు వెచ్చించేందుకు కూడా సిద్ధపడిందంటే ఏపీ జలదోపిడీ ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు. ఒకదశలో శ్రీశైలం జలాశయం నుంచి పైప్లైన్ ద్వారా తరలించుకుపోతామని తమిళనాడు వ్యాఖ్యానించిందంటే, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడీని అర్థం చేసుకోవచ్చు. చెన్నై తాగునీటి ఒప్పందం ఆచరణలో ఎంతగా విఫలమైన తీరుకు ఇదో నిదర్శనం.
కేంద్రం నదుల అనుసంధానం ప్రాజెక్టు సైతం ఆచరణలో అదే తరహాలో మారనున్నదని తెలంగాణ ఇంజినీర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నదుల అనుసంధానం ప్రాజెక్టు తెలంగాణ పాలి ట మరో పోతిరెడ్డిపాడులా పరిణమిస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదిస్తున్న గోదావరి-కావేరి అనుసంధానం ప్రాజెక్ట్ ద్వారా ఛత్తీస్గఢ్ వినియోగించుకోని 148 టీఎంసీల గోదావరి జలాలను ఇచ్చంపల్లి వద్ద బరాజ్ను నిర్మించి అక్కడి నుంచి తొలుత నాగార్జునసాగర్కు, ఆపై సోమశిలకు, అక్కడి నుంచి తమిళనాడులోని మమన్డూర్ ట్యాంక్కు, ఆపై కావేరి ఆనకట్టకు తరలించాల్సి ఉంటుంది. ఇందులో సోమశిల నుంచి తమిళనాడు సరిహద్దు వరకు దాదాపు 376 కిలోమీటర్ల కాలువ తవ్వాల్సి ఉంటుంది. అయితే, కేవలం 160-170 కిలోమీటర్ల మేర పరిధిలోనే ఏటా భారీగా జలదోపిడీకి పాల్పడుతున్న ఏపీ ఇప్పుడు ఊరుకుంటుందా? అనేది ఇంజినీర్ల ప్రశ్న. అంతేకాదు, చెన్నై ఒప్పందాన్ని రెండు దశాబ్దాలుగా సజావుగా అమలు చేయలేని కేంద్రం 1,078 కిలోమీటర్లకుపైగా ఉన్న గోదావరి-కావేరి అనుసంధానం ప్రాజెక్ట్ను ఎలా నియంత్రిస్తుందని ప్రశ్నిస్తున్నా రు. 34 టీఎంసీలకు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీని పరిమితం చేయలేని కేంద్రం, రివర్ బోర్డు రేపటి రోజున గోదావరి జలాలను ఏపీ అక్రమం గా మళ్లిస్తే ఎలా అడ్డుకుంటాయని నిలదీస్తున్నా రు. నిర్వహణ, నియంత్రణ అసాధ్యమని స్పష్టంచేస్తున్నారు. వెరసి చెన్నై తాగునీటి సరఫరా మాదిరిగానే తుదకు గోదావరి- కావేరి అనుసంధానం కూడా మిగిలిపోతుందని హెచ్చరిస్తున్నా రు. ఈ అనుసంధానం ద్వారా తమిళనాడుకు లాభం చేకూరడం సంగతేమోగానీ, లోయర్ గోదావరి జలాల వినియోగానికి తెలంగాణకు మాత్రం ఇబ్బందులు తప్పవని ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు. అయినా బీజేపీ మాత్రం జీసీ లింక్ అంటున్నదంటే రాజకీయ ప్రయోజనాల కోస మేనని అభిప్రాయపడుతున్నారు.