BJP | హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగ దీక్ష పేరుతో బీజేపీ హైదరాబాద్లో చేపట్టిన కార్యక్రమం నవ్వులపాలైంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డితోపాటు దాదాపు పార్టీ ముఖ్యనేతలంతా ఈ దీక్షలో పాల్గొన్నారు. అయినా వేదికపై నేతలే తప్ప వేదిక ముందు నిరుద్యోగులు కరువయ్యారు. కనీసం టెంటు కూడా నిండని దుస్థితి. నిరుద్యోగుల కోసం ఈ దీక్ష అని చెప్పినా.. యువత నుంచి కనీస స్పందన కరువైంది. రాజకీయ నేతలు తప్ప విద్యార్థులు, నిరుద్యోగులు ఎక్కడా కనిపించలేదు. దీంతో ఇది ‘రాజకీయ నిరుద్యోగ దీక్ష’ అంటూ ప్రజలు జోకులు వేసుకున్నారు. మరోవైపు వేదికపై నేతల ప్రసంగాలు హాస్యాస్పదంగా సాగాయి.
నేతలంగా ‘బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు’ అని పలుమార్లు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై విద్యార్థులు, యువత, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం మొదటి దఫాలో లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసింది కనిపించలేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ ఏడాది దాదాపుగా అన్ని విభాగాల్లో వరుసగా నోటిఫికేషన్లు విడుదల అయ్యాయని, పరీక్షలు సైతం జరుగుతున్నాయని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఈ ఏడాదిని ఉద్యోగ నామ సంవత్సరంగా మార్చారని అంటున్నారు. అయినా బీజేపీ నేతలకు కనిపించడం లేదంటే ‘ఏ లోకంలో బతుకున్నారు బాబూ’ అంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఓవైపు ఒక్క నోటిఫికేషన్ రాలేదంటూనే మరోవైపు గ్రూప్ -1 పేపర్ లీకైందని, నియామకాల్లో అక్రమాలు జరిగాయని మాట్లాడటంపైనా మండిపడుతున్నారు.
నోటిఫికేషన్ రాకుండా పరీక్ష ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు. గ్రూప్-1 పరీక్ష లీకేజీని మొదట గుర్తించింది, విచారణ జరిపింది, నిందితులను అరెస్ట్ చేసింది ప్రభుత్వమేనని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేకపోతే కుంభకోణాన్ని ఎందుకు బయటపెడుతుందని నిలదీస్తున్నారు. మరోవైపు బీజేపీ దీక్షకు పోలీసులు సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఇచ్చారు. అయినా కిషన్రెడ్డి సహా నేతలు తమ కార్యక్రమాన్ని కొనసాగించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు ఈ దీక్షను భగ్నం చేసి, నేతలను అరెస్ట్ చేశారు. ఇది కూడా రాజకీయ ఎత్తుగడలో భాగమేనని నెటిజన్లు మండిపడుతున్నారు. అనుమతించిన సమ యం తర్వాత కూడా కార్యక్రమం కొనసాగిస్తే పోలీసులు వస్తారని, అప్పుడు కార్యకర్తలు, నేతల సాయంతో తోపులాటలు, ఘర్షణలు, సొమ్మసిల్లిపడిపోవడాలు వంటి నాటకాలు ఆడితే రాజకీయంగా మైలేజీ వస్తుందనేది బీజేపీ ప్లాన్ అని పేర్కొంటున్నారు. అలాంటివాటిని తెలంగాణ ప్రజలు పట్టించుకోరని స్పష్టం
చేస్తున్నారు.