జగిత్యాల టౌన్, ఫిబ్రవరి 7: ‘అర్వింద్ హఠావో.. బీజేపీ బచావో’ అంటూ నిజమాబాద్ ఎంపీపై ఆ పార్టీ సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు. అర్వింద్ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నక్సల్స్ను ఎదిరించి, వ్యాపారాలు, కుటుంబాలను త్యాగం చేసి 30 ఏండ్లుగా పార్టీని కాపాడుకుంటూ వస్తున్నామని తెలిపారు. కానీ అర్వింద్.. పార్టీ నాయకులు, ప్రజలకు ఏనాడూ అందుబాటులో ఉండలేదని విమర్శించారు.
ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన నాయకులపై కేసులు పెట్టించారని మండిపడ్డారు. అర్వింద్కు మళ్లీ ఎంపీ టికెట్ ఇస్తే ఒడించి తీరుతామని స్పష్టం చేశారు. ఆయనకు తప్ప ఎవరికి ఇచ్చినా కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకుంటామని తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చీటి శేఖర్రావు, ఠాకూర్ విద్యాసింగ్, ఎడమల వెంకట్రాజం, లింగాల శ్రీకాంత్రావు, బావేటి శ్రీనివాస్, గోగికర్ మహేందర్, గట్టపెల్లి జ్ఞానేశ్వర్, జైనపురం రమేశ్, మామిడి శేఖర్, కాసరపు శ్రీనివాస్, కట్ట విజయ్, చుక్క అశోక్, గొడిసెల నాగరాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.