కరీంనగర్, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): బీసీలను ఆగం చేసేందుకు జాతీయ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించా రు. కాంగ్రెస్, బీజేపీలు బీసీలకు ఏనాడూ న్యాయం చేయలేదని, బీసీలను నాశనం చేసేందుకే ఆ పార్టీలు పుట్టాయని ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బీసీలకు ఏం న్యాయం చేసిందో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. దమ్ముంటే ఆ పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకులు తన సవాల్ను స్వీకరించాలన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని మార్కెట్ యార్డులో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అధ్యక్షతన గౌడ కులస్థుల ఆశీర్వాద సభకు మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్యఅతిథిగా రాగా.. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు కల్లు గీత వృత్తిని హీనంగా, నీచం గా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. 70 ఏండ్లలో కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవించిన గౌడ కులస్థులు గత పాలకుల వైఖరి వల్ల తీవ్రంగా దెబ్బతిన్నారని విచారం వ్య క్తం చేశారు. కల్లుకు ప్రత్యామ్నాయంగా చీప్ లిక్కర్ను ప్రవేశపెట్టి హైదరాబాద్లో కల్లు అమ్మకాలను నిషేధించిన విషయాన్ని గుర్తుచేశారు. వృత్తి పన్ను, చెట్టు పన్ను కడుతూ గౌడన్నలు అనేక కష్టాలు ఎదుర్కొంటూనే వృత్తిలో కొనసాగుతూ వచ్చారన్నారు.
స్వరాష్ట్రంలోనే మంచి రోజులు..
కేసీఆర్ సీఎం అయిన తర్వాత గౌడ కులస్థుల్లో ఆత్మగౌరవం పెరిగిందని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. వృత్తి, చెట్టు పన్ను మాఫీ చేశారని, కల్లు గీసే వృత్తి గౌడలకే పరిమితం చేశారని తెలిపారు. నీరా అమ్మకాలు గౌడేతరులు విక్రయిస్తే జైలుకు పంపే జీవో లు తెచ్చారని చెప్పారు. వృత్తిలో ప్రమాదవశాత్తు చనిపోయిన గీత కార్మికుల కుటుంబానికి ఇచ్చే ఎక్స్గ్రేషియాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. తాజాగా వైన్ షాపుల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని, దీనిద్వారా రాష్ట్రంలో 360 వైన్ షాపు లు గౌడ కులస్థులకు వస్తాయన్నారు. వైన్ షాపుల్లో రిజర్వేషన్లు కల్పించిన పద్ధతి ప్ర పంచంలో ఎక్కడా లేదన్నారు. గీత కార్మికులకు మోపెడ్ వాహనాలు ఇవ్వాలని మంత్రి హరీశ్రావుతో కలిసి వెళ్లి సీఎం కేసీఆర్ను కోరతామని హామీ ఇచ్చా రు. సీఎం కేసీఆర్ గౌడ ఆత్మగౌరవ భవనం నిర్మించుకునేందు కు హైదరాబాద్లో రూ.300 కోట్ల విలువైన భూమిని ఇచ్చిన విషయాన్ని శ్రీనివాస్గౌడ్ గుర్తుచేశారు. హుజూరాబాద్ ఓటర్లకు కేసీఆర్ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని, టీఆర్ఎస్కు ఓటు వేసి గెల్లు శ్రీనివాస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సభలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, గంగాధర్గౌడ్, లక్ష్మీనారాయణగౌడ్, ఎమ్మెల్యేలు సతీశ్కుమార్, ప్రకాశ్గౌడ్, దివాకర్గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశంగౌడ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కరీంనగర్ మేయర్ సునీల్రావు, పార్టీ నాయకుడు పాడి కౌశిక్రెడ్డి పాల్గొన్నారు.
హుజూరాబాద్లో గెలిచి ఏం చేస్తరు?
60 శాతం జనాభా ఉన్న బీసీలను చిన్నచూపు చూస్తున్న బీజేపీకి ఎట్లా ఓటు వేయమంటారని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. ఒక్క హుజూరాబాద్లో గెలిచి ఏం చేస్తారని, ఇండ్లు ఇస్తరా?, సామాజిక భవనాలు ఇస్తరా?, ఆరోగ్యాలు దెబ్బతింటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తరా?, ఎల్వోసీలు ఇస్తరా?, ఏమిస్తరో చెప్పాలని బీజేపీ నాయకులను డిమాండ్ చేశారు.