హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో విద్యా వికాసానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతున్నదని, కొత్తగా విద్యా సంస్థలను మంజూరు చేయడం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో అనేక విద్యా సంస్థలు నెలకొల్పేందుకు అవకాశం ఉన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో చలనం రావడం లేదని వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణలో నవోదయ విద్యాలయాలు, కరీంనగర్ లో ట్రిపుల్ ఐ.టీ ఏర్పాటు, హైదరాబాద్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ( ఐ.ఐ.ఎస్.ఇ.ఆర్ ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ( ఐ.ఐ.ఎం ) వంటి పలు విద్యా సంస్థలు మంజూరు చేయకుండా కేంద్ర బీజేపీ సర్కార్ తెలంగాణకు తీరని అన్యాయానికి గురి చేస్తోందని వినోద్ కుమార్ ఆరోపించారు.
రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు విద్యా సంస్థల మంజూరులో తమతో కలిసి రావడం లేదని, కనీసం సొంతంగానైనా బీజేపీ ఎంపీలు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్ర బీజేపీ ఎంపీల వైఖరి ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని, ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ ఎంపీలు చిత్తశుద్ధితో కృషి చేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలను ఏర్పాటు చేసిందని, కొత్త జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం హైదరాబాద్ ను మినహాయిస్తే 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లాకొకటి చొప్పున రాష్ట్రానికి మరో 23 నవోదయ విద్యాలయాలు రావాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ తెలిపారు.
కొత్తగా నవోదయ విద్యాలయాలు ఏర్పాటు అయితే గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు విద్యా పరంగా ఎంతో మేలు జరుగుతుందని వినోద్ కుమార్ వివరించారు.
ఇప్పటికైనా రాష్ట్రంలో 23 నవోదయ విద్యాలయాలు, ఐ.ఐ.ఎస్.ఇ.ఆర్, ఐ.ఐ.ఎం, కరీంనగర్ లో ట్రిపుల్ ఐ.టీ ఏర్పాటు చేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.