హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): తల్లిలాంటి తెలంగాణను పార్లమెంట్ సాక్షిగా నిండు సభలో బీజేపీ ఎంపీ అవమానిస్తే, తెలంగాణకు చెందిన 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కిక్కురుమనలేదు. కనీసం ఖండించేందుకు నోరెత్తలేదు. తెలంగాణను అవమానిస్తే మాకెందుకులే..? అనే ధోరణిలో ఇతర రాష్ర్టాల ఎంపీల మాదిరిగానే తెలంగాణ ఎంపీలు సైతం బెల్లంకొట్టిన రాయిలా మౌనంగా ఉండిపోయారు. కనీసం లేచి నిలబడి అభ్యంతరమో, నిరసననో తెలిపేందుకు కూడా ప్రయత్నించలేదు. తెలంగాణను అవమానించినప్పటికీ స్పందించని ఎంపీల తీరుపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం కావాలి, తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి కానీ, తెలంగాణను ఎవరేమన్నా తమకు అవసరంలేదనే విధంగా ఎంపీలు వ్యవహరించారనే ఆగ్రహం వ్యక్తమవుతున్నది. గురువారం లోక్సభలో మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్పై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణపై జుగుప్సాకరమైన, తీవ్ర అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా అవమానించేలా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్, పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ రోత వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఎంపీలు పార్లమెంట్లో గర్జించాలి. తేజస్వీ వ్యాఖ్యలపై ఆందోళన చేయాలి. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయాలి. కానీ, ఈ పనిని ఒక్కరంటే ఒక్క తెలంగాణ ఎంపీ కూడా చేయకపోవడం శోచనీయం. తేజస్వీ సూర్య ఈ రోత వ్యాఖ్యలు చేస్తున్న సందర్భంలో ఆయనకు అటువైపు, ఇటువైపు తెలంగాణకు చెందిన 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు మొత్తం 16 మంది కూర్చున్నారు. కానీ, వీరిలో ఒక్కరంటే ఒక్కరు కూడా నోరు మెదపలేదు. కనీసం లేచి నిలబడి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. తెలంగాణ తమ రాష్ట్రం కాదనుకున్నారో లేక తెలంగాణను తిడితే తమకొచ్చిన నష్టమేమిటని అనుకున్నారో తెలియదు కానీ, కనీసం స్పందించే ధైర్యం చేయలేదు.
పార్లమెంట్ ఆవరణలోనే ఉన్న సీఎం రేవంత్
దీనికితోడు ఆ సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్లమెంట్ ఆవరణలోనే ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు కూతవేటు దూరంలోనే ఉన్నారు. ఎప్పుడైతే ఎంపీ తేజస్వీ తెలంగాణ ఏర్పాటును అవమానించేలా వ్యాఖ్యలు చేశారో.. వెంటనే సీఎం రేవంత్రెడ్డి కల్పించుకొని తమ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయాలి. తేజస్వీ వ్యాఖ్యలను ఖండించాలని, నిరసన వ్యక్తం చేయాలని తమ పార్టీ ఎంపీలకు సూచించాలి. కానీ, సీఎం రేవంత్రెడ్డి సైతం తెలంగాణకు జరిగిన అవమానాన్ని తేలిగ్గా తీసుకున్నట్టున్నారు. అందుకే ఆయన కూడా స్పందించలేదు.